- పూర్తైన జంగిల్ క్లియరెన్స్ వర్క్స్
- ఈ నెల 15 నుంచి రాజధాని
నిర్మాణ పనులు ప్రారంభం - వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. ఏపీ క్యాపిటల్ ఈ ప్రాంతమే అంటూ ప్రకటించింది మొదలు రియల్ ఎస్టేట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఫ్యూచర్లో హైద్రాబాద్కు పోటీ అవుతుందో లేదో గానీ అమరావతి ప్లానింగ్, రోడ్ మ్యాప్.. అభివృద్ధి చుట్టూ జరిగే డిస్కషన్స్ మాత్రం ఏపీ వాసుల్లో చాలా ఆశలే కల్పిస్తున్నాయ్. అస్తవ్యస్త నిర్ణయాలతో గత ఐదేళ్లు అమరావతిలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడులకి ఎవరూ ముందుకు రాలేదు. మరి ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పొచ్చింది..? కూటమి సర్కార్ రియాల్టీ సెక్టార్కు ఊపిరిపోసిందా..? అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా..? ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు, అమ్మకాలు ఎలా ఉన్నాయ్..? వచ్చే పదేళ్లలో అభివృద్ధి చెందే ప్రాంతాలేవి..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి కొత్త ఊపిరి పీల్చుకొంటోంది. గత పదేళ్లలో- ఐదేళ్లు ఓ వెలుగు వెలిగి.. మరో ఐదేళ్లు పాడుబడిన దీనగాధ అమరావతికి మాత్రమే సొంతం. ఇక మీదట ఇదంతా హిస్టరీనే. ప్రభుత్వం మారీ మారడంతోనే ఆంధ్రుల రాజధానికి కొత్త ఉత్సాహం వచ్చింది. తన రూపురేఖలు పూర్తిగా మార్చుకొంటోంది అమరావతి. సీఆర్డీఏ పరిధిలో జంగిల్ క్లియరెన్స్ పనులు అయిపోయాయ్. ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన పెండింగ్ వర్క్స్ని పూర్తి చేయించడంలో బిజీగా ఉన్నారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్లు టార్గెట్గా పెట్టుకుని ఈ పీరియడ్లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది ఏపీలోని కూటమి సర్కార్.
రియాల్టీకి రెక్కలు!
అమరావతి పనులు ట్రాక్ ఎక్కడంతోనే అక్కడ రియాల్టీ సెక్టార్కు మళ్లీ రెక్కలు వచ్చాయ్. ఊహించినంత గొప్పగా కాకపోయినా ఊపు అయితే కనిపిస్తోంది అక్కడ. వాస్తవానికి దేశమంతా నిర్మాణ రంగం కాస్త నిస్తేజంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అమరావతిలో ఎంక్వైరీలు.. కొనుగోళ్లు- అమ్మకాలు జరుగుతుండటం అక్కడ డెవలపర్లకి ఉత్సాహానిచ్చే విషయమే. పైగా రాష్ట్రానికి పెట్టుబడులు సైతం వస్తున్నాయ్. అంటే- ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టే. కాబట్టి ఎంత త్వరగా రాజధాని నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమై.. ఎంత త్వరగా పూర్తైతే అమరావతి రియాల్టీ రంగం అంత త్వరగా తనదైన ముద్ర వేయగలదంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు.
పెరిగిన ధరలు
- గత 9 నెలల్లో 30-40% పెరిగిన భూముల ధరలు
- సింగిల్ విండో క్లియరెన్స్లు
- లేఔట్లలో రోడ్ల వెడల్పు
- 12 నుంచి 9 మీటర్లకి తగ్గింపు
- 5 అంతస్థుల్లోపు నిర్మాణాలకు
- స్వీయ ధృవీకరణ పత్రం చాలు
30-40 శాతం పెరుగుదల
అమరావతి పూర్తైతే ఏపీ ఫేట్ మారిపోవడం ఖాయమనే నమ్మకం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి. అసలు ప్రభుత్వం మారిన వెంటనే అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయ్. ఈ తొమ్మిది నెలల్లో సుమారు 30-40 శాతం వరకు రేట్లు పెరిగాయంటున్నారు. రీసెంట్గా విజయవాడలో ఎకరం భూమి 27 కోట్లు పలికింది. మరో సైట్ను 35 కోట్లు పెట్టి కొనుగోలు చేశారనే వార్తలు అమరావతి ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయ్. పైగా ప్రభుత్వం కూడా స్థిరాస్తి రంగానికి ప్రోత్సహానిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. సింగిల్ విండో అనుమతులతో పాటు లేఔట్లలో రోడ్ల వెడల్పు 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించడం.. 5 అంతస్థుల్లోపు భవన నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే చాలు.. అధికారుల అనుమతులు అవసరం లేదంటూ తెచ్చిన కొత్త విధానాలు ఇటు బిల్డర్లకు.. అటు బయ్యర్లకు ఉత్సాహానిచ్చేవే.
కనెక్టివి
టీకి ప్రాధాన్యం..
ఏ రాష్ట్ర రాజధానికైనా దశా-దిశా మార్చేవి రోడ్లే. అమరావతిలో కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, నేషనల్ హైవేస్తో కనెక్టివిటీ.. ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్లు, విజయవాడకి మెట్రో ప్రతిపాదనలు కొలిక్కి వస్తే ఆటోమోటిగ్గా రియల్ ఎస్టేట్ బూమ్ రావడం ఖాయం. ధరల నియంత్రణ వ్యాపారుల చేతుల్లో లేదని.. భూముల ధరలు, లేబర్, నిర్మాణ సామాగ్రి ఖర్చులు పెరిగిపోయాయని ఆ ప్రభావం ఆస్తుల కొనుగోలు సమయంలో కనిపిస్తుందంటున్నారు. అయినప్పటికీ.. మిగిలిన రాష్ట్రాలతో పొల్చితే అమరావతిలో ఇప్పటికీ భూముల ధరలు అందుబాటులో ఉన్నాయని.. అపార్టమెంట్లలో ఫ్లాట్లు, లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నరెడ్కో ప్రతినిధులు. అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాక ధరలు పెరిగే అవకాశముందంటున్నారు.
రేట్లు ఇలా ఉన్నాయ్
- సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలు..
- గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అమరావతి ప్రభావం
- లొకేషన్ బట్టి అమరావతిలో
- ఎస్ఎఫ్టీ రూ. 3500-6000
- హై రైజ్ బిల్డింగ్స్లో
- రూ. 5 నుంచి 8 వేలు (చ.అ.కీ.)
పెట్టుబడులకు అనుకూలం..
మాస్టర్ ప్లాన్లో భాగంగా అమరావతి రాజధాని కాగా.. తొమ్మిది థీమ్లతో 9 నగరాలను డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ పేరుతో నిర్మించే నవ నగరాలు రాజధానికి అనుసంధానంగా ఉండనున్నాయ్. వచ్చే పదేళ్లలో ఏయే ప్రాంతాల అభివృద్ధికి అవకాశముందంటే.. సీఆర్డీఏ పరిధిలో ఉన్న 29 గ్రామాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వరకు అమరావతి ప్రభావం ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ పెట్టుబడులకు అనుకూలమే.