Categories: TOP STORIES

ఆన్‌లైన్ షాపింగ్ వ‌ద్దు గురూ!

  • షాపింగ్ మాల్స్, స్టోర్ల సందర్శనకు కొనుగోలుదారుల మొగ్గు
  • విశ్రాంతి, వినోదం కోరుకోవడమే కారణం

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోం విధానానికి, ఆన్ లైన్ షాపింగులకే పరిమితమైన జనం.. నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఆన్ లైన్ వీడి ఆఫ్ లైన్ బాట పడుతున్నారు. షాపింగ్ మాల్స్, స్టోర్లకు వెళ్లి నేరుగా కావాల్సినవి కొన‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా ప్రైవేట్ లిమిటెడ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘ద రిటైల్ పెర్ స్పెక్టివ్ ఆన్ ఎక్స్ పీరియన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఆన్ లైన్ రిటైల్ అన్ని అవసరాలను తీర్చలేకపోతోందని పేర్కొంది. అంతేకాకుండా ఔటింగ్, వస్తువులను తాకి చూసి కొనుగోలు చేయడం, రోజువారీ రొటీన్ జీవితం నుంచి తగినంత విశ్రాంతి లభించడం వంటి కీలక అంశాలు స్టోర్ షాపర్ల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వివరించింది. కరోనా తర్వాత భారతీయ రిటైల్ మార్కెట్, వినోద్ ప్రదేశాలకు తాకిడి పెరిగిందని, 2022 రెండో త్రైమాసికంలో రిటైల్ రంగం బాగా పుంజుకుందని తెలిపింది. త్రైమాసికాలవారీగా చూసుకుంటే రిటైల్ లావాదేవీల కార్యకలాపాలు 100 శాతం కంటే ఎక్కువయ్యాయని పేర్కొంది. అదే 2022 తొలి అర్ధభాగం చూస్తే ఇది వార్షికంగా 160 శాతం వృద్ది నమోదైందని చెప్పింది. వాస్తవానికి ఆన్ లైన్ షాపింగ్ కూడా పటిష్టంగానే కొనసాగుతోందని, అదే సమయంలో భౌతికంగా రిటైల్ స్టోర్ల సందర్శనకు పలువురు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ పెరుగుదల కనిపిస్తోందని వివరించింది.

స్టోర్లలో షాపింగ్ చేయడానికి ప్రధాన కారణాలు..

  • వస్తువులు కొనుగోలు చేసే ముందు దానిని పరిశీలించి తీసుకోవడం
  • కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ
  • స్టోర్ లో కొనుగోలు సౌకర్యవంతంగా ఉండటం
  • స్టోర్ లో తిరుగుతూ కావాల్సిన వస్తువులను కొనుక్కోవడాన్ని ఆస్వాదించడం
  • షిప్పింగ్ చార్జీలు వెచ్చించడం ఇష్టం లేకపోవడం
  • కావాల్సింది ఏదైనా వెంటనే పొందే అవకాశం ఉండటం
  • ఆకర్షణీయమైన ఆఫర్లు పొందే వెసులుబాటు ఉండటం
  • ఇంటి నుంచి కాసేపు బయటకు వెళ్లాలనుకోవడం
  • ఆన్ లైన్ లోఅందుబాటులో లేని వస్తువులు కొనుక్కోవడం కోసం

కరోనా మహమ్మారి, ఐసోలేషన్ తదితర పరిణామాలతో రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైన వినియోగదారులు ఇప్పుడు మునుపటి పరిస్థితుల్లోకి వచ్చేశారు. బయటకు రావడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి మునుప‌టి మాదిరిగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేయడం కంటే నేరుగా దుకాణాలకు సందర్శించడానికి ఇష్టపడుతున్నారని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రిటైలర్-కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి నగరాల్లోని బ్రాండ్లు తమ పోర్టిఫోలియోలను వైవిధ్యపరచడానికి, తమ స్టోర్ వ్యూహాలను మారుస్తున్నాయని వివరించింది.

రిటైల్ రంగంలోని తాజా పరిస్థితులు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో సీబీఆర్ఈ చైర్మన్ అంశుమ‌న్‌ మ్యాగజీన్ వివరించారు. ‘భౌతిక రిటైల్ లొకేషన్లు తప్పనిసరిగా ప్రజలు వెళ్లాలనుకునే ప్రదేశాలుగా అభివృద్ధి చెందాలి. రిటైల్ వ్యాపార కార్యకలాపాలు ఇప్పటికే కోవిడ్ మునుపటి స్థాయికి చేరుకున్నాయని మేం విశ్వసిస్తున్నాం. అదే సమయంలో కోవిడ్-19 వినియోగదారుల ప్రాధాన్యతలను కాస్త మార్చేసింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలోని వారు తమ అనుభవాన్ని, రియల్ వివులవను మెరుగుపరచడానికి ఏం చేయాలో ఆలోచించడం అత్యవసరం’ అని పేర్కొన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్లగ్ అండ్ ప్లే రిటైల్ ఔట్ లెట్స్ కు మంచి డిమాండ్ ఉందని, ముఖ్యంగా చిన్న, స్వతంత్ర సంస్థలు ఇలాంటి వాటిపై మొగ్గు చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది. మరోవైపు పలు రకాల డిజైన్లతో స్టోర్ ను అలంకరించడం ద్వారా కూడా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.

This website uses cookies.