Categories: TOP STORIES

రూ.150 వేతనం నుంచి వేల కోట్ల అధిపతి వరకు

  • థైరోకేర్ అధినేత డాక్టర్ ఆరోక్య వేలుమణి విజయగాథ

అతనో నిరుపేద. తండ్రి కనీసం చెప్పులు కూడా కొని పెట్టలేనంత. అలాంటి వ్యక్తి.. నేడు దాదాపు రూ.5 వేల కోట్లకు అధిపతి. థైరోకేర్ రంగంలో తిరుగులేని వ్యాపారవేత్త. ఆయనే డాక్టర్ ఆరోక్య వేలుమణి. థైరోకేర్ టెక్నాలజీస్ అధినేత. ఆయన కంపెనీలో తన వాటా 66 శాతాన్ని రూ.4,546 కోట్లకు ఫార్మ్ ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ కు విక్రయించారు. ఇందులో రూ.1500 కోట్లు వెచ్చించి ఏపీఐ హోల్డింగ్స్ లో 4.9 శాతం వాటా కొనుగోలు చేయనున్నారు. ఈ డీల్ వల్ల ఫార్మ్ ఈజీ విలువ రూ.13,390 కోట్ల నుంచి రూ.29,700 కోట్లకు చేరింది. ఇంగ్లిష్ రాని వ్యక్తి.. కేవలం డిగ్రీతో ఉద్యోగ వేటకు బయటకు వచ్చిన వ్యక్తి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు? ఆయన విజయగాథ ఏమిటి? క్రెడాయ్ నాట్ కాన్ 2022 కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్న డాక్టర్ వేలుమణి గురించి ప్రత్యేక కథనం..

వేలుమణి కొయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించారు. నాన్న ఇంటిని సరిగా పట్టించుకునేవారు కాదు. తల్లి తన బంగారం తాకట్టు పెట్టి రెండు గేదెలు కొని, ఆ పాలతో వ్యాపారం చేస్తూ కుటుంబ పోషణ చేశారు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసిన వేలుమణి ఉద్యోగ వేటకు బయలుదేరారు. అక్కడా కష్టాలే. 50 కంపెనీలకు వెళ్లినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇంగ్లిష్ వచ్చా? ఎక్స్ పీరియన్స్ ఉందా? ఇవే ప్రశ్నలు. దీంతో నిరాశలో ఉన్న సమయంలో జెమినీ ల్యాబ్స్ అనే ఫార్మా ల్యాబ్ కంపెనీలో రూ.150 జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే, నాలుగేళ్ల తర్వాత ఆ కంపెనీ మూతపడటంతో వేలుమణి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో 1982లో బాంబే వచ్చి మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. చివరకు బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లో నెలకు రూ.880 జీతానికి ఉద్యోగం వచ్చింది. దీంతోపాటు సాయంత్రం ట్యూషన్లు చెబుతూ మరో రూ.వెయ్యి సంపాదించేవారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న సుమతిని వివాహం చేసుకుని ఉద్యోగంలో కొనసాగారు.

ఆయనకు ఇంకా ఏదో చేయాలనే తపన ఎక్కువ కావడంతో ఓరోజు హఠాత్తుగా ఉద్యోగం మానేశారు. అర్థరాత్రి భార్యకు తన రాజీనామా గురించి చెప్పారు. దీంతో ఆమె ఏమాత్రం సందేహించకుండా తను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో, ఇద్దరూ కలిసి 1995లో బైకుల్లాలో థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో థైరాయిడ్ పరీక్షకు రూ.400 చార్జీ వసూలు చేస్తుండటంతో వీరు దానిని రూ.100కి తీసుకొచ్చారు. రోజుకు 25 శాంపిళ్లు ప్రాసెస్ చేసేవారు. అలా నెమ్మదిగా వాటి సంఖ్య పెంచుకుంటూ వచ్చారు. 1999లో దీనిని ఫ్రాంచైజీ మోడల్ గా అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా శాంపిళ్లు సేకరించే ముంబై తీసుకొచ్చేవారు. వాటిని ప్రాసెస్ చేసి ఫలితం చెప్పేవాళ్లు. అలా రోజుకు 200 శాంపిళ్లు ప్రాసెస్ చేసేవారు. 2015 వరకు ముంబైలో థైరోకేర్ టెక్నాలజీస్ కు ఒక్కటే ల్యాబ్ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. థైరాయిడ్ పరీక్ష కాకుండా మెడికల్ హెల్త్ చెకప్స్, బ్లడ్ టెస్టుల వంటివి కూడా చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో గతేడాది థైరోకేర్ ఆదాయం 18 శాతం పెరిగి రూ.474 కోట్లకు చేరుకుంది. లాభాలు 51 శాతం పెరిగి రూ.119.7 కోట్లకు చేరాయి. 2016లో ఐపీఓకు వెళ్లగా చాలా మంచి స్పందన వచ్చింది. అలా పెరుగుతూ ప్రస్తుతం ఆ కంపెనీ విలువ దాదాపు రూ.7వేల కోట్లకు చేరింది. అందులో వేలుమణి సొంత వాటాయే దాదాపు రూ.5వేల కోట్లు. సాధారణంగా అందరూ డిస్కస్ చేసుకుని డిసైడ్ అవుతారు. కానీ వేలుమణి మాత్రం డిసైడ్ అయ్యాక డిస్కస్ చేస్తారు. ఇదీ ఆయన విజయగాథ.

This website uses cookies.