Categories: LATEST UPDATES

ఖానామెట్ వేలాన్ని నిలిపేసిన హైకోర్టు

  • వైఎస్సార్ హ‌యంలో కోర్టు కేసు
  • తెలంగాణ‌లోనూ అదే రిపీట్‌
  • కేటీఆర్ క‌ళ్లు మూసుకున్నారా?
  • జ‌యేష్ రంజ‌న్ నిద్ర‌పోయాడా?
  • క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే ఇలా జ‌రిగేదా?

ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నామో అదే మ‌ళ్లీ జ‌రిగింది. గ‌తంలో వైఎస్సార్ హ‌యంలో నిర్వ‌హించిన వేలం పాట‌ల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన జాతీయ సంస్థ‌లు.. కోట్ల రూపాయ‌ల్ని చెల్లించి మ‌రీ కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి అంశాన్ని ప‌రిశీలించి వేలం పాట‌ల్ని నిర్వ‌హించింద‌ని భావిస్తే.. టీఎస్ఐఐసీ అధికారులు త‌ప్పులో కాలేశారు. మాదాపూర్ చేరువ‌లోని ఖానామెట్‌లో ఏకంగా శ్మ‌శాన వాటిక‌లో ఉన్న భూముల్ని వేలం వేశారు. స్థానికులు కోర్టులో కేసు వేసేవ‌ర‌కూ ఈ విష‌యం ప్రభుత్వానికి తెలియ‌క‌పోవ‌డం దారుణం.

మ‌రి, టీఎస్ఐఐసీ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ ఏం చేసిన‌ట్లు? ఏం చూసిన‌ట్లు? వేలం పాట‌ల్ని నిర్వ‌హించ‌డం కంటే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆయా స్థ‌లాల్ని నిశితంగా ప‌రిశీలిస్తే అస‌లీ స‌మ‌స్య వ‌చ్చేదే కాదు. అందులో శ్మ‌శాన వాటిక‌ను మిన‌హాయించి మిగ‌తా భూముల్ని వేలం వేస్తే అయినా బాగుండేది. కానీ, జ‌యేష్ రంజ‌న్ కానీ అత‌ని కింది స్థాయి అధికారులు కానీ అందులో శ్మ‌శాన వాటిక ఉంద‌నే విష‌యం తెలుసుకోలేక‌పోయారు. ఒక‌వేళ తెలిసినా.. ఎవ‌రేం చేస్తారులే అనే ధీమాతో ముందుకెళ్లారని స్థానికులు అంటున్నారు. ఏదీఏమైనా వైఎస్సార్ త‌ర్వాత మ‌ళ్లీ తెలంగాణ ప‌రువు కూడా పోయిన‌ట్లేన‌ని రియ‌ల్ట‌ర్లు చెబుతున్నారు. ఇందుకు ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

జ‌యేష్ రంజ‌న్ క్షేత్ర‌స్థాయిలో తిరిగి క‌నీసం ఒక్క‌సారి అయినా భూముల్ని ప‌రిశీలిస్తే ఈ స‌మ‌స్య వ‌చ్చేది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఖానామెట్ భూముల విక్ర‌యాన్ని హైకోర్టు నిలిపివేయ‌డంతో అందులో స్థ‌లాలు కొన్న‌వారు షాక్ కు గుర‌య్యారు. మ‌రి, ఈ స‌మ‌స్య‌ కోర్టు పరిధిలోకి వెళ్లింది కాబట్టి, కోర్టు తదుపరి ఉత్తర్వులు కోసం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్లిన భూమిని లింక్ వెల్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది.

This website uses cookies.