Categories: TOP STORIES

మోకిలలో 300 ప్లాట్లు అమ్మ‌కానికి సిద్ధం

  • 165 ఎకరాల్లో 1,321 ప్లాట్ల లేఅవుట్ ను
    అభివృద్ధి చేస్తున్న హెచ్ఎండిఏ

శంకర్ పల్లిలోని మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిల లేఅవుట్లో 300 ప్లాట్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టింది. దీనికి సంబంధించి గురువారం మోకిల లేఅవుట్ ప్రాంతంలో హెచ్ఎండిఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని హెచ్ఎండీఏ విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మోకిల‌లో దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సిఐఓ) ఎస్.కె.మీరా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సిపిఓ) రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) సాయిరాం,శంకర్ పల్లి మండలం తహశీల్దార్ సురేంద్రలతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రీబిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే పద్ధతులను వివరించారు. హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రాముఖ్యతను వివరించారు. ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

This website uses cookies.