Categories: LATEST UPDATES

ముంబై సబర్బన్ లో భారీ డీల్

బోరివలిలో రూ.14 కోట్లకు అమ్ముడైన 4 బీహెచ్ కే ఫ్లాట్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ముంబై సబర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రాపర్టీ ధరలు నింగిని తాకుతున్నాయి. ముంబై బోరివలిలోని 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ చదరపు అడుగుకు రూ.56వేల చొప్పున రూ.14 కోట్లకు అమ్ముడుపోయింది. బోరివలిలో ఇప్పటివరకు పలికిన రేట్లలో అత్యధికం. ముంబైలోని అంధేరి, విలే పార్లే, దాదర్, మహిమ్ వంటి ఇతర ప్రాంతాలతో ఇది సమానం కావడం గమనార్హం. ఈ లావాదేవీతో బోరివలి ప్రాపర్టీ మార్కెట్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ అయింది.

 

వాద్వా గ్రూప్ నిర్మించిన అక్వేరియా గ్రాండే అనే గ్రేడ్-ఎ రెసిడెన్షియల్ భవనంలో 2497 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ ఈ ధరకు అమ్ముడైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త హేమంత్ పాటిల్ కొనుగోలు చేశారు. 27వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ కు రెండు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. జూన్ 21న నమోదైన లావాదేవీలో రూ.84 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. కాగా, బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలోని అపార్ట్ మెంట్ కోసం చదరపు అడుగుకు రూ.48,800 ధర పలికింది. ప్రస్తుతం అపార్ట్ మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు ఉంది.

చాలా ప్రాజెక్టులు చదరపు అడుగుకు రూ.30వేల చొప్పున విక్రయం అవుతున్నాయి. ప్రస్తుతం బాంద్రాలోని పాలి హిల్, వర్లి వంటి ప్రాంతాలు ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ అనేక లగ్జరీ అపార్ట్ మెంట్లు చదరపు అడుగుకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలుకుతున్నాయి.

This website uses cookies.