- పహల్గామ్ దాడితో తిరోగమనంలో ప్రాపర్టీ రంగం
- 30 శాతం మేర తగ్గిపోయిన ధరలు
- ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేత
అది భూతల స్వర్గం. పర్యాటకులు అమితంగా ఇష్టపడే ప్రదేశం. కానీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం తిరోగమనం. ఆ ప్రాంతమే కాశ్మీర్. గతంలో పోలిస్తే.. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయనకునే లోపే ఉగ్రభూతం మళ్లీ పంజా విసిరింది. పహల్లామ్ దాడితో 26 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో పరిస్థితులు మళ్లీ ఎప్పటిలాగే మారిపోయాయి. ముఖ్యంగా రియల్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత దారుణ పతనాన్ని చవిచూస్తోంది. కొన్ని నెలల క్రితం రూ.1 కోటి విలువ చేసిన ఆస్తులు ఇప్పుడు రూ.70 లక్షలకు మించి పలకడంలేదు. ఇది ఈ ప్రాంత ప్రాపర్టీ మార్కెట్ చరిత్రలో అత్యంత దారుణమైన క్షీణతలలో ఒకటి. ప్రస్తుతం కాశ్మీర్ రియల్ విలువలు దాదాపు 30 శాతం మేర తగ్గిపోయాయి. రానురాను డిమాండ్ తగ్గిపోతుండటంతో విక్రేతలు ధరలను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న వినాశకరమైన ఉగ్రవాద దాడి, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి “నాకౌట్ దెబ్బ” అని పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. “మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది” అని సౌరాలోని ప్రాపర్టీ కన్సల్టెంట్ ముహమ్మద్ షఫీ చెప్పారు. “ఒకప్పుడు వారాలలోపు అమ్ముడైన ప్రాపర్టీలు ఇప్పుడు నెలల తరబడి ఒక్క ఎంక్వైరీ కూడా రావడంలేదు” అని వివరించారు. పహల్గామ్ దాడి ప్రభావం బాగా ఉందని చెప్పారు. పర్యాటక బుకింగ్లు 90 శాతానికి పైగా క్షీణించాయని.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ను తీవ్రంగా దెబ్బతీసే ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గత అర్ధ దశాబ్దంలో పర్యాటక ఆధారిత పెట్టుబడి, ప్రాంతీయ స్థిరత్వంతో ఉత్సాహంగా ఉన్న కాశ్మీర్ ప్రాపర్టీ మార్కెట్, ఇప్పుడు అత్యంత దారుణమైన తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చాలామంది స్థానిక కొనుగోలుదారులు బడ్జెట్, స్నేహపూర్వక ప్రాపర్టీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆల్పైన్ రియల్టర్స్ సహ యజమాని ముబాషిర్ భట్ పేర్కొన్నారు. నిర్మాణ రంగం దాదాపుగా ఆగిపోయిందని.. డెవలపర్లు ప్రధాన గృహ ప్రాజెక్టులను నిరవధికంగా నిలిపివేశారని తెలిపారు.
“మేం రెండు ప్రధాన ప్రాజెక్టులను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వాతావరణంలో కొత్త వెంచర్లను ప్రారంభించడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం మా దృష్టి ఇప్పటికే ఉన్న ప్రాపర్టీలను విక్రయించడంపైనే ఉంది’’ అని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ వెల్లడించారు. నిర్మాణాలు స్తంభించడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా అది మరి సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఇక్కడ పాత పరిస్థితులు నెలకొనడానికి చాలా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.