- ఫ్లాట్ల అప్పగింతలో రెరా ఆదేశాలనూ పాటించరా?
- 14 మంది కొనుగోలుదారుల ఆవేదన
- రెరా కూడా స్పందిచకపోవడంతో తమ సమస్యలో సీఎం జోక్యం చేసుకోవాలని వినతి
ప్లాట్ల స్వాధీనం చేసే విషయంలో తులసీ భాగ్యనగర్ ప్రాజెక్టు డెవలపర్లు చూపిస్తున్న నిర్లక్ష్యం సబబు కాదని కొనుగోలుదారులు వాపోతున్నారు. తెలంగాణ రెరా జారీ చేసిన ఆదేశాలను సైతం అమలు చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ దుండిగల్ లోని తులసి భాగ్యనగర్ ప్రాజెక్టులో పలువురు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి గ్రీన్ మెట్రో ఇన్ ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, భవనతేజా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు డెవలపర్, మార్కెటింగ్ కంపెనీలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము కుదుర్చుకున్న అమ్మకపు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడంతోపాటు రెరా చట్టంలోని పలు అంశాలను పాటించడంలేదంటూ 14 మంది కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించారు.
విచారణ జరిపిని రెరా.. ఈ ఏడాది జనవరి 24న ఆదేశాలు జారీ చేసింది. రెండు కంపెనీలు రూ.8,57,697 జరిమానా చెల్లించడంతోపు కొనుగోలుదారుల నుంచి పూర్తి మొత్తం అందిన 60 రోజుల్లోగా వారికి ఫ్లాట్లు అప్పగించాలని స్పష్టంచేసింది. ఒకవేళ ఈ ఆదేశాలు అమలు చేయకుంటే రెరా చట్టంలోని సెక్షన్లు 63, 65 కింద జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ, డెవలపర్లు వీటిపై స్పందించలేదు. రెండు నెలలు దాటినా కంపెనీలు స్పందించకపోవడంతో రెరా ఆదేశాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతో టీజీ రెరాలో పిటిషన్ దాఖలు చేశారు.
45 రోజులపాటు వేచి ఉన్నా టీజీ రెరా నుంచి కూడా స్పందన లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెరా చట్టం, 2016లోని సెక్షన్ 40 ప్రకారం, ఒక ప్రమోటర్ రెరా జారీ చేసిన ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే, బకాయిలను భూమి ఆదాయ బకాయిలుగా తిరిగి పొందేందుకు అధికారం అధికారం కలిగి ఉంటుంది. గృహ కొనుగోలుదారుల హక్కులు రక్షించడానికి, డెవలపర్లు నియంత్రణ చట్రానికి కట్టుబడి ఉన్నారని నిర్ధారించడానికి ఈ నిబంధన చేర్చారు. అయితే, ఈ వ్యవహారంలో రెరా సైతం తగిన చర్యలు తీసుకోకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.