- సెకండ్ ఫేజుతో రియల్ రంగం వృద్ధి చెందుతుందా?
- మూడేళ్లలో ఒకట్రెండు పూర్తయితే అద్భుతమే!
- రియల్టర్లు, ఏజెంట్లు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మకండి
- వాస్తవికంగా ఆలోచించి ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేయండి
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం హైప్ మీదే జరుగుతోంది. గత పదిహేను, ఇరవై ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. అక్కడేదో అద్భుతం వచ్చేస్తుందనగానే.. ప్రజలంతా అక్కడికెళ్లి ప్లాట్లు, ఫ్లాట్లను కొనేస్తుంటారు. అదేవిధంగా, శంషాబాద్ విమానాశ్రయం వచ్చే ముందు వేలంవెర్రిగా మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొని పదేళ్లపాటు వేచి చూశారు. ఇప్పుడేమో మెట్రో రైలు వస్తుందంటూ.. ఫ్యూచర్ సిటీ.. శామీర్పేట్.. మేడ్చల్.. వంటి ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతున్నట్లుగా కొందరు రియల్టర్లు, ఏజెంట్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంతానికి మెట్రో రైలు వచ్చినంత మాత్రాన.. ఆయా ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఆయా ప్రాంతం వృద్ధి చెందడానికి కనీసం ఐదు నుంచి పదేళ్లు పడుతుందని మర్చిపోవద్దు. కాబట్టి, రియాల్టీలో పెట్టుబడి పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మెట్రో రైలు సెకండ్ ఫేజు కూడా ఇందుకు మినహాయింపేం కాదు.
హైదరాబాద్లో మెట్రో రైలు రాక ముందే హైటెక్సిటీ ద్వారా అభివృద్ధికి బీజం పడింది. తర్వాత రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఐటీ, ఆర్థిక సంస్థల కారణంగా అక్కడి సమీపంలో రియల్ మార్కెట్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతేతప్ప, రాత్రికి రాత్రే ఆయా ప్రాంతాలు డెవలప్ కాలేదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. 2010లో ఆరంభమైన మెట్రో రైలు ప్రాజెక్టు పనుల వల్ల శివారు ప్రాంతాల్లో నివసించాలనే ఆలోచన నగరవాసుల్లో పెరిగింది. నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మెట్రో మార్గాలు కనెక్టివిటీని పెంచేసింది. ఇప్పుడు రెండో దశ మెట్రో వల్ల హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, అందుకు కొంత సమయం పడుతుంది. ఇది వాస్తవం.
వాస్తవానికి, హైదరాబాద్లో మెట్రో రైలును నిర్మించాలనే ఆలోచన 2003లో చంద్రబాబు నాయుడు చేశారు. కాకపోతే, 2004లో ప్రభుత్వం మారగానే ఆ పని మూలకు పడింది. తిరిగి 2007లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలో మెట్రోకు శంకుస్థాపన జరిగిన సత్యం స్కామ్ వల్ల మూలకు పడింది. మళ్లీ 2010లో ఎల్అండ్టీ మెట్రో టెండర్లను దక్కించుకుని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయంలో మెట్రో పనులు మొదలయ్యాయి. 2013లో మెట్రో రైల్ ప్రాజెక్టు స్పీడ్ అందుకుంది. అప్పటి వరకు సెంట్రల్ హైదరాబాద్ లోనే ఇల్లు కావాలనుకునే వారు మెట్రోతో కనెక్టివిటీ పెరగనుండటంతో కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో నివసించేందుకు మొగ్గుచూపెట్టారు. అందుకు అనుగుణంగానే బిల్డర్లు, నిర్మాణ సంస్థలు మెట్రో కనెక్టివిటీని అనుసరించి ఆయా ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు.
2012లో ఎల్బీ నగర్ లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.2-3వేలకు మధ్యలో ఉండేది. మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ 40-45 లక్షల్లో దొరికేది. మియాపూర్తో సహా ఆ పరిసర ప్రాంతాలైన కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రెండు నుంచి మూడు వేల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడేమో ఏకంగా చదరపు అడుక్కీ రూ.6000 నుంచి ఏడు వేల మధ్యకు చేరింది. కూకట్పల్లిలో అయితే చదరపు అడుక్కీ రూ.8000కు అటుఇటుగా చెబుతున్నారు.
ఇటు నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గంలోను ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. రాయదుర్గం పరిసర ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పొప్పాలగూడ, నార్సింగి వంటి ప్రాంతాలపై మెట్రో ప్రభావం బాగా పడింది. అప్పటికే రాయదుర్గం ప్రాంతంలో ఐటీ అభివృద్ధి చెందగా, దానికి తోడు మెట్రో రావడంతో కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయ్యింది. నాగోల్ లో 2012 లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ చదరపు అడుగుకీ 2000-3000 మధ్యలో లభించేవి. ఇప్పుడు నాగోల్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ చదరపు అడుగు 6 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల మధ్య ధరలున్నాయి. అంటే 2012 తో పోలిస్తే ఇప్పుడు 400 శాతం ధరలు పెరిగాయి. ఇండిపెండెంట్ ఇళ్లు సైతం నాగోల్ లో అప్పుడు 25 లక్షల్లో లభించగా.. ఇప్పుడు కోటి రూపాయల పైమాటే.
ఇక రాయదుర్గం ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. 2012తో పోలిస్తే ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాయదుర్గంతో పాటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, పొప్పాలగూడ, నానక్ రాంగూడ, నార్సింగి వంటి ప్రాంతాల్లో 2012 లో అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 3000 నుంచి 4000 వేల రూపాయల వరకు ధరలుండేవి. కానీ ఇప్పుడు ఇక్కడ చదరపు అడుగు ప్రాజెక్టుని బట్టి చదరపు అడుగు 8 వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలు పెరిగాయి. అంటే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం కోటి 20 లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే. 2012 తో పోలిస్తే 300 నుంచి 400 శాతం ధరలు పెరిగాయి. ఇక్కడ ఇంటి స్థలాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు గజం రెండు లక్షల నుంచి 3 లక్షల మధ్య ధరలున్నాయి. భూముల ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇక్కడ ఎకరం ధర 70 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలుగా ఉంది.
సెకండ్ ఫేజ్ వస్తే?
ఇక ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుతో నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందనే అంచనాలు పెరిగాయి. మెట్రో రెండో దశలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పుడిప్పుడే ఈ మార్గాల్లో మెట్రో పూర్తి కాకపోయినా.. వచ్చే ఐదు నుంచి పదేళ్లలోపు పూర్తయినా.. ఆయా ప్రాంతాలకు మంచి డిమాండ్ పెరుగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం మేడ్చల్లో ఫ్లాట్లు చదరపు అడుగుకీ 5,500 రూపాయల నుంచి లభిస్తున్నాయి. కానీ మూడేళ్లలో మెట్రో పూర్తయితే.. కనీసం ఏడు నుంచి ఎనిమిది వేలకు పెరిగే అవకాశముంది. శామీర్ పేట్ లో ప్రస్తుతం చదరపు అడుగుకి 5 వేలకు అటుఇటుగా ఫ్లాట్లు లభిస్తున్నాయి. మెట్రో నిర్మాణం తరువాత చదరపు అడుగు 7 వేల దాకా పెరిగేందుకు ఆస్కారముంది. ఇక ప్యూచర్ సిటీ విషయానికి వస్తే.. డీటీసీపీ అనుమతి గల ప్లాట్ల ధరలు సుమారు ఇరవై వేలకు అటుఇటుగా ఉన్నాయి. ఒకవేళ మెట్రో అంటూ పూర్తయితే రేట్లు పెరిగేందుకు ఆస్కారముంది. కాకపోతే, జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆదరణ పెరుగుతుంది. మరి, ఫ్యూచర్ సిటీతో పాటు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయేలా ఎప్పుడు మారుతుంది? మెట్రో ఎప్పుడు మొదలవుతుందనే సందేహాలైతే ఉన్నాయి. కాబట్టి, ఫ్యూచర్ సిటీలో ఐదేళ్లలో మెట్రో రైలు కూత వినిపిస్తుందనే ఆశలైతే పెట్టుకోకండి. ఈ మూడేళ్లు దాటిన తర్వాత.. అప్పుడొచ్చే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని బట్టి ఫ్యూచర్సిటీ ఆధారపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి, ప్లాట్లు మరియు భూముల ధరల్ని పెంచుకునేందుకు రియల్టర్లు, ఏజెంట్లు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మకండి. వాస్తవికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మెట్రో ఆరంభం.. పూర్తి..!
2003- ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మెట్రో రైలుకు ప్రణాళికలు
2004- ప్రభుత్వం రాగానే ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేశారు
2007- దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మెట్రోకు పచ్చజెండా
2008- మేటాస్ ఇన్ఫ్రాకు కాంట్రాక్టు
2009- సత్యం స్కామ్తో మెట్రో నుంచి వైదొలగిన మేటాస్
2010- పీపీపీ మోడల్లో మెట్రో బిడ్ దక్కించుకున్న ఎల్అండ్టీ మెట్రో
2012- ఏప్రిల్ 26న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
2017- నవంబర్ 28న పీఎం మోడీ చేతుల మీదుగా ఫేజు 1 ఆరంభం
2020- ఫస్ట్ ఫేజు 69 కిమీ పూర్తి.