బెంగళూరులో రికార్డు స్థాయి అమ్మకం
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో భారీ రియల్ లావాదేవీ జరిగింది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో లగ్జరీ పెంట్ హౌస్ రికార్డు స్థాయిలో రూ.54 కోట్ల ధర పలికింది. బెంగళూరు సంపంగిరామ్ నగర్లోని 7,065 చదరపు అడుగుల లగ్జరీ పెంట్హౌస్ ₹54 కోట్లకు పైగా అమ్ముడైనట్టు జాప్క్ వెల్లడించింది. బెంగళూరులోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్లలో ఇది ఒకటని పేర్కొంది. యూకేకి చెందిన మార్కెట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సీఈఓ పరేష్ రాజా.. ఎంఏఐఏ ఎస్టేట్స్ 27 సమ్మిట్ ప్రాజెక్టులో లగ్జీరీ పెంట్ హౌస్ ను రూ.54.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. సెంట్రల్ బెంగళూరులోని అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఒకటైన సంపంగిరామ్ నగర్లో ఉన్న ఈ పెంట్హౌస్ 7,065 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 25, 26వ అంతస్తుల్లో ఇది ఉంది.
చదరపు అడుగుకు రూ.77,000 కార్పెట్ ఏరియా రేటు, చదరపు అడుగుకు రూ.51,170 సూపర్ బిల్ట్-అప్ రేటు పడినట్టయింది. ఈ కొనుగోలు కింద నాలుగు పార్కింగ్ స్థలాలు, డబుల్ గ్యారేజ్, ప్రైవేట్ స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. కాగా, ఎంఏఐఏ ఎస్టేట్స్ ప్రస్తుతం దాని లగ్జరీ ప్రాజెక్ట్ 27 సమ్మిట్లో అపార్ట్ మెంట్లను మార్కెటింగ్ చేస్తోంది. ఇందులో 4,200 చదరపు అడుగుల యూనిట్ల ధర రూ.20 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. రూ.54 కోట్లకు లగ్జరీ పెంట్ హౌస్ అమ్మడుకావడం బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగానికి సానుకూలమైన అంశమని రియల్ నిపుణులు చెబుతున్నారు. సంపంగిరామ్ నగర్ బెంగళూరులో కేంద్రంగా చక్కని అనుసంధానం కలిగిన ప్రదేశం.
ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఇటువంటి ప్రీమియం ధరలను కలిగి ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని చాలా లగ్జరీ ఆస్తులు సాధారణంగా చదరపు అడుగుకు రూ.25,000 నుంచి రూ.40,000 మధ్య ధరలో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, గత డిసెంబర్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి నగరంలోని ప్రత్యేకమైన కింగ్ఫిషర్ టవర్స్ లో రెండు లగ్జరీ అపార్ట్ మెంట్ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు బెంగళూరులో అత్యధిక విలువైన నివాస లావాదేవీలలో ఒకటిగా పరిగణించారు. అలాగే ఇందిరానగర్లో ఆగస్టులో మరో ముఖ్యమైన అధిక-విలువ లావాదేవీ జరిగింది, ఇక్కడ ఒక ప్రాపర్టీ రూ.47.5 కోట్లకు అమ్ముడైంది.