Categories: TOP STORIES

మియా’పూర్‌’.. ఫ్లాట్స్ ‘రిచ్‌’

మియాపూర్ మెట్రో స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్టుమెంట్లను నిర్మించే బిల్డర్లు పెరిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గత పది, పదిహేనేళ్లలో.. అధిక శాతం మంది డెవలపర్లు చెరువులను కబ్జా చేసి.. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో అపార్టుమెంట్లను నిర్మించారు. స్థానిక సంస్థలూ చూసీచూడనట్లు వ్యవహరించడం.. నీటిపారుదల శాఖ ఆయా నిర్మాణాల్ని పట్టించుకోకపోవడంతో అధిక శాతం అక్రమ నిర్మాణాలు చెరువుల్లో వెలిశాయి. ఆహ్లాద‌క‌రంగా ఉండాల్సిన ప్రాంతాల్ని అక్ర‌మ క‌ట్ట‌డాల‌తో అంద‌వికారంగా మార్చేసిన ఇలాంటి బిల్డ‌ర్ల‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నా.. ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాల్లేవు. ఈ అంశాన్ని పక్కన పెడితే.. మియాపూర్ మెట్రో కారణంగా ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అనుమ‌తితో.. రెరా ఆమోదం తీసుకుని.. అపార్టుమెంట్ల‌ను క‌ట్టే డెవ‌ల‌ప‌ర్లూ ఉన్నారు.

కోర్టు అనుమ‌తితో అపార్టుమెంట్లు..

మెట్రో రైలు దిగగానే అలా నడుచుకుంటూ వెళ్లే మాతృశ్రీ న‌గ‌ర్‌లో కొందరు బిల్డర్లు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరి నిర్మాణాల్ని చేపట్టిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం స్థలం దొరికితే చాలు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అపార్టుమెంట్లను నిర్మించేందుకు బిల్డర్లు పోటీ పడుతున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే.. కొంతదూరం నడుచుకుంటూ వెళితే.. హెరిటేజ్ పక్కనే ప్రణీత్ సంస్థ జైత్ర అనే ప్రాజెక్టును ఆరంభించింది. అక్క‌డి చుట్టుప‌క్క‌ల గోపాల్ న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో పలువురు చిన్న, మధ్యస్థాయి బిల్డర్లు స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటెయిన్ హెడ్ ఎదురుగా అంటే కల్వరీ టెంపుల్ పక్కనే ఒక డెవలపర్ ఏకంగా చెరువు పక్కనే అపార్టుమెంట్ ను కట్టేసినా జీహెచ్ఎంసీ అధికారులు క‌ళ్లు మూసుకున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంత మంది ఇక్క‌డ అపార్టుమెంట్ల‌ను ఇలాగే నిర్మిస్తారో తెలియ‌దు.

ఈ రోడ్డు హాట్ గురూ..

మియాపూర్ నుంచి బాచుప‌ల్లి రోడ్డు ఈమ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డి ట్రాఫిక్ లైట్ల‌నుంచి కాస్త ముందుకెళ్ల‌గానే ఆర్‌వీ నిర్మాణ్ సంస్థ ఒక ప్రాజెక్టును ఆరంభించింది. క‌రెక్టుగా గుర్నాధం చెరువుకు ఆనుకుని ఓ బ‌డా గేటెడ్ క‌మ్యూనిటీని ఇక్క‌డ నిర్మిస్తోంది. కాస్త ముందుకెళ్ల‌గానే కుడివైపు వ‌ర్టెక్స్ సంస్ధ విరాట్ అనే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్టిల్ట్ ప్ల‌స్ 25 అంత‌స్తుల ఎత్తులో ఈ బ‌డా గేటెడ్ క‌మ్యూనిటినీ క‌డుతున్న‌ది. ఇప్ప‌టికే భారీ స్థాయిలో ప‌లువురు ఇందులో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. ఓ రెండు వంద‌ల అడుగులు ముందుకు వేయ‌గానే.. కుడివైపు ఆర్‌వీ నిర్మాణ్ ధ‌ర్మిష్ఠా అనే ప్రాజెక్టును పూర్తి చేసింది. దానిప‌క్క‌నే బెంగ‌ళూరుకు చెందిన క్యాండియ‌ర్ అనే సంస్థ న‌ల‌భై అడుగుల క్యాండియ‌ర్ ఫార్టీ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. నిర్మాణ ప‌నుల్ని శ‌ర‌వేగంగా జరుపుతోంది. అయితే, రెండేళ్ల క్రితం వ‌ర‌కూ చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4 వేల‌కు అటుఇటుగా ఉన్న మియాపూర్ ఫ్లాట్ల ధ‌ర‌లు 2019 త‌ర్వాత ఒక్క‌సారిగా రూ.6వేల‌కు చేరుకున్నాయి. ఈ ర‌హ‌దారి అభివృద్ధి కాలేదు. ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. మౌలిక స‌దుపాయాలు మెరుగ‌వ్వ‌లేదు. గుర్నాధం చెరువులో ఉన్న దోమ‌లు పోలేదు. క‌నీసం ఆ చెరువు చుట్టూ ఉన్న‌వాకింగ్ ట్రాక్ ను డెవ‌ల‌ప్ చేయ‌లేదు. ఆ మురుగునీటిని శుద్ధి చేసిన దాఖ‌లాల్లేవు. అయినా, అపార్టుమెంట్ ధ‌ర‌లు మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. మ‌రి, ఈ ఫ్లాట్ల రేటు పెరుగుట దేనికి సంకేత‌మో?

మియాపూర్లో పలు ప్రాజెక్టులు..

పేరు విస్తీర్ణం (ఎకరాల్లో)   ఫ్లాట్ల సంఖ్య  బిల్టప్ ఏరియా పూర్తి?
ఆస్పయిర్ స్పేసెస్ అమేయా 10 1066 1210- 1940 2024 డిసెంబరు
దివ్యశ్రీశక్తి 18 825 1956- 3152 గృహప్రవేశానికి సిద్ధం
టాక్ ఆఫ్ హైదరాబాద్ 9.15 1900 1099-1914 2026 మార్చి
లక్ష్మీ ఎస్ ఇంపీరియా 3.59 450 999-2243 2026 మార్చి
. క్యాండియర్ 4.82 959 1170- 1610 2026 సెప్టెంబరు
హర్షిత్ రెసిడెన్సీ ఎస్సార్ 1 40 1080-1305 2021 అక్టోబరు
సత్య నివ్రిత్తి 3.84 252 1298- 1746 2026 మార్చి
సాయి మిర్రా పాంచజన్య 4 462 1260- 1733
కేవ‌లం అవ‌గాహ‌న కోస‌మే ఈ ప‌ట్టిక‌.పూర్తి వివ‌రాల‌కు బిల్డ‌ర్‌ను సంప్రదించండి.

This website uses cookies.