Categories: LATEST UPDATES

ఆగస్టులో రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్లు ఆగస్టు మాసంలో అదరగొట్టాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సంబంధించి హైదరాబాద్ లో ఏకంగా రూ.2,658 కోట్ల విలువైన 5,181 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆషాఢ మాసం సందర్భంగా అంతకుముందు నెలల్లో అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు తగ్గిన నేపథ్యంలో ఆగస్టులో ఒక్కసారిగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడించింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.22,680 కోట్ల విలువైన 46,078 రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

కాగా, ఆగస్టులో జరిగిన అమ్మకాల్లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర కలిగిన యూనిట్లు 55 శాతం ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. 2021 ఆగస్టులో ఇది 37 శాతం కావడం గమనార్హం. అలాగే రూ.25 లక్షల లోపు విలువ కలిగి ఇళ్ల డిమాండ్ ఆగస్టులో 16 శాతం ఉండగా.. అది గతేడాది ఆగస్టులో 35 శాతం ఉంది. ఇక రూ.50 లక్షల కంటే పైబడిన ఇళ్ల అమ్మకాలు గతేడాది ఆగస్టులో 28 శాతం ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో 29 శాతానికి పెరిగింది. సెగ్మెంట్లవారీగా చూస్తే.. వెయ్యి చదరపు గజాల పైబడిన ఇళ్ల షేర్ ఏకంగా 83 శాతం ఉండటం విశేషం. వెయ్యి గజాల నుంచి 2వేల గజాలలోపు ఇళ్ల వాటా 72 శాతంగా నమోదైంది. జిల్లాలవారీగా గణాంకాలు పరిశీలిస్తే.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఆగస్టు రిజిస్ట్రేషన్లు 44 శాతం కాగా, రంగారెడ్డి జిల్లా 38 శాతం, హైదరాబాద్ జిల్లా 14 శాతం ఉంది.

This website uses cookies.