- శాటిలైట్ టౌన్ షిప్ తో ఇండ్ల విక్రయం
- తొలి దఫా అంచనా 800 కోట్లు
- ఓఆర్ఆర్ చుట్టూ అపార్ట్మెంట్లు
- సొంతంగా నిర్మాణం చేసి అమ్మాలని నిర్ణయం
- ప్రిలిమినరీ డీపీఆర్ రెడీ
భూముల విక్రయాల్ని చేపట్టడానికి సిద్ధమైన రేవంత్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్లో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను తీర్చడానికి ప్రభుత్వమే నేరుగా నిర్మాణ రంగంలోకి దిగుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి పథకాలను ఈ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుండగా.. తాజాగా టౌన్ షిపుల నిర్మాణాల్లో అడుగు పెడుతోంది.
గతంలో వైఎస్ హయాం నుంచే ప్లానింగ్లో ఉన్న శాటిలైట్ టౌన్ షిపులను మధ్యలో బీఆర్ఎస్ కూడా కంటిన్యూ చేస్తున్నట్లే ప్రకటింది. కానీ, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే ప్రకటన చేసింది. శాటిలైట్ టౌన్షిప్లను సొంతంగా నిర్మించి, అమ్మేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తుంది. అయితే, గతంలో ఇదే తరహాలో ఆలోచించి.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాల్ని చేపట్టి.. నేటికీ పూర్తి చేయలేకపోయిన విషయం తెలిసిందే. మరి, ఈసారి ఏం జరుగుతుందో తెలియాలంటే.. కొంతకాలం వేచి చూడాల్సిందే.
సిటీ నలువైపులా అభివృద్ధి చేసేలా గత కొంతకాలంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించి అన్ని సౌకర్యాలతో లే-అవుట్లు ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలకు భూములు కేటాయించి, అపార్ట్మెంట్లు నిర్మించి, ప్రభుత్వం తరపునే అమ్మాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. తొలి దశలో దీని కోసం రూ. 800 కోట్లు ఖర్చు పెడుతామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ ప్రకటన చేసింది.
దీనికోసం 30 వేల ఎకరాలను సిద్ధం చేసినట్లు కూడా చెప్తున్నది. అయితే, దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. సీఎం, ఆయన సోదరులు, కొంతమంది రియల్టర్ల కోసమే ఫోర్త్ సిటీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పంథా మార్చింది. ఏకంగా ప్రభుత్వమే కొత్త నగరాలకు శ్రీకారం చుట్టింది. తాగునీరు, డ్రైనేజీ, విశాలమైన రోడ్లతో కూడిన కాలుష్యం లేని ప్రాంతాలుగా వీటిని అభివృద్ధి చేస్తుందని సమాచారం.
ట్రిపుల్ ఆర్.. ఓఆర్ఆర్ మధ్య
మేడ్చల్, సంగారెడ్డి, షాద్ నగర్, ఘట్కేసర్ ఇలా సిటీకి నాలుగు దిక్కుల అన్ని వసతులు కల్పించి ప్రత్యేక టౌన్ షిప్స్ ఏర్పాటు చేయడంపైనే ఫోకస్ చేశారు. హైదరాబాద్ సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నిర్మాణం చేసే శాటిలైట్ అపార్ట్మెంట్లలో హైద్రాబాద్ నగరంలో మాదిరి విద్య, వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తేచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ అవుతుంది.
పాత వాటికి అనుగుణంగా కొత్తగా..
నగర శివార్లలో శాటిలైట్ టౌన్షిపుల ఏర్పాటు కొత్త ప్రయోగం ఏమీ కాదు. గతంలో వైఎస్ హాయాంలోనే ఈ అడుగు పడింది. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత భూ సేకరణ కూడా చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో ప్రభుత్వం 80 ఎకరాలు సేకరించి, శాటిలైట్ టౌన్షిప్ నిర్మానానికి మ్యాప్ వేసింది. ఈ భూమిని అభివృద్ధి చేశాక ఇందులో 60 శాతం ప్లాట్లు తిరిగి రైతులకే విక్రయిస్తామని కూడా చెప్పారు. మిగిలిన 40 శాతం భూమిలో టౌన్షిప్ను హెచ్ఎండీఏ వేలం వేసి అమ్మేస్తుంది. అటు కొత్తూరు మండలం ఇన్మూల్ నర్వాలో కూడా స్థానిక రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద సుమారు 75 ఎకరాలను సేకరించింది హెచ్ఎండీఏ.
ఇక్కడ కూడా రైతులకు ప్లాట్లు ఇచ్చి, మిగిలింది వేలంలో అమ్ముతుంది. ఇక సాగర్ నేషనల్ హైవే నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ముచ్చర్ల ఫార్మా సిటీకి 1150 ఎకరాల్లో ఈ-సిటీ ఉంది. సాగర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే ఆదిభట్ల ఐటీ హబ్ కూడా ఉంది. పైగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో కనెక్టివిటీ సమస్యే లేదు. శాటిలైట్ టౌన్షిప్పులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నిర్మించాలని ముందుగా ప్లాన్ వేసినా… ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగుతోందని సమాచారం.