Categories: TOP STORIES

భాగ్యనగరంలో అమ్మకాలు భళా

జనవరి-జూన్ మధ్య 21 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు

ప్రధాన నగరాల్లోనూ పెరిగిన విక్రయాలు

నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి

హైదరాబాద్ రియల్ మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) ఇళ్ల విక్రయాలు బాగా జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 21 శాతం మేర పెరిగి 18,573 యూనిట్లకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే ఆఫీస్‌ వసతులకు డిమాండ్‌ 71 శాతం పెరిగి 5 మిలియన్‌ చదరపు అడుగులకు చేరినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి-జూన్‌ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. మొత్తమ్మీద దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఇళ్ల అమ్మకాలు 1.73 లక్షల యూనిట్లకు చేరాయి.

భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండటం బలమైన ఆర్థిక మూలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు. దీని ఫలితంగానే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్‌ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. నగరాలవారీగా చూస్తే.. ముంబైలో ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి.

గతేడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే 16 శాతం అధికం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. పుణెలో 13 శాతం పెరుగుదలతో 24,525 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 25 శాతం పెరిగాయి. అహ్మదాబాద్‌ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి.

This website uses cookies.