Categories: TOP STORIES

వాకింగ్‌ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత

కరోనా నేపథ్యంలో గృహ కొనుగోలుదారుల ఎంపిక ప్రాధాన్యతలు మారాయి. గతంలో ధర, వసతులకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన కస్టమర్లు కరోనా తర్వాతి నుంచి ఆరోగ్య సంబంధిత వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 72 శాతం మంది కస్టమర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్‌ ట్రాక్స్‌ ఉండాలని, 68 శాతం మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారని రియల్ ఎస్టేట్ గురు అధ్యయనంలో తేలింది.

స్విమ్మింగ్‌ పూల్‌ వసతులపై పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. 64 శాతం మంది ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారని పేర్కొంది. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77 శాతం మంది రెండవ ప్రియారిటీ డెవలపర్‌ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్‌ డిజైన్, లొకేషన్‌ ఎంపికల ప్రాధమ్యాలుగా ఉన్నాయని తెలిపింది.

ప్రవాసులు కొనేది ఆ నగరాల్లోనే..

బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్‌ వంటి పట్టణాలపై మక్కువ చూపిస్తున్నారు. 41 శాతం మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతుకుతున్నారు. 65 శాతం మంది వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు.

60 శాతానికి పెరిగిన ఆన్‌లైన్‌..

ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్‌ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్‌లైన్‌ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ బృందం, సోషల్‌ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారు.

This website uses cookies.