Categories: TOP STORIES

అనువు కాని చోట.. ఆకాశహర్మ్యాలు ఎందుకు?

  • ఎత్తుగా క‌డితే ఎవ‌రికి ఉప‌యోగం?
  • కొన్ని ప్రాంతాల్లోనే ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు
    అనుమ‌తిని మంజూరు చేయాలి
  • ఆవేశంగా ఆరంభించి.. అవి పూర్తి కాక‌పోతే
    అందులో కొన్న‌వారికి త‌ప్ప‌వు తిప్ప‌లు!
  • ఘోస్ట్ టవర్లుగా మిగిలిపోయే ప్రమాదం

నిన్నటివరకూ.. నానక్ రాంగూడ ఓఆర్ఆర్ చౌరస్తాలో.. శ్లాబులు వేసి ఒక బడా నిర్మాణం ఖాళీగా కనిపించేది. కొన్ని నెలల పాటు ఆయా నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకుండా.. కేవలం టవర్లు మాత్రం దర్శనమిచ్చేవి. మళ్లీ ఏమైందో తెలియదు కానీ, ఈమధ్యే ఎలివేషన్ పనులు ఆరంభించారు. కోర్ ఏరియాలో ఉన్న ఐటీ, వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తారు కాబట్టి, పెట్టుబడిదారులకు కొదవ ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రెసిడెన్షియల్ ప్రాంతాల్లో.. నలభై, యాభై అంతస్తులు కట్టడం ఎంతవరకూ సమంజసం? ఆర్థిక మాంద్యం బుసలు కొడుతున్న నేపథ్యంలో.. అనువు కాని చోట ఆకాశహర్మ్యాల్ని కడితే ఎలా?

రాష్ట్రంలో ఉన్న అప‌రిమిత ఎఫ్ఎస్ఐ నిబంధ‌న కార‌ణంగా.. కొంద‌రు స్థ‌ల య‌జ‌మానులు గొంత్తెమ్మ కోరిక‌లు కోరుతుండ‌టంతో ప్రొఫెష‌న‌ల్ డెవ‌ల‌ప‌ర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ప‌ది అంత‌స్తులు క‌ట్టే చోట ఇర‌వై అంత‌స్తులు.. ప‌దిహేను అంత‌స్తులు నిర్మించే చోట 30 నుంచి న‌ల‌భై అంత‌స్తుల్ని క‌ట్టాల‌ని కండీష‌న్లు పెడుతున్నారు. అధిక ఎస్ఎఫ్టీ కట్టాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో సందిట్లో స‌డేమియాలా కొంద‌రు నడిమంత్ర‌పు వ్య‌క్తులు.. బిల్డ‌ర్లుగా అవ‌తారం ఎత్తి.. స్థ‌ల‌య‌జ‌మానుల డిమాండ్ల‌ను తీరుస్తామంటూ ఫోజులు కొడుతూ.. ముప్ప‌య్ నుంచి యాభై అంతస్తులు కట్టేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి వారే ఎక్కువగా యూడీఎస్‌, ప్రీలాంచ్ స్కీముల‌ను ప్ర‌క‌టిస్తూ.. స‌రికొత్త స్కాముల‌కు తెర‌లేపుతున్నారు. న‌గ‌రం నాలుగు వైపులా స్థ‌లం కొర‌తే లేని హైద‌రాబాద్‌లో.. న‌ల‌భై, యాభై అంత‌స్తులు క‌ట్ట‌డ‌మేమిట‌ని నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు. దీని వల్ల భాగ్యనగరంలోని మౌలిక సదుపాయాలపై ఎక్కడ్లేని ఒత్తిడి పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

భాగ్య‌న‌గ‌రం అంత‌ర్జాతీయ న‌గ‌రాల స‌ర‌స‌న నిల‌బ‌డాలంటే.. న‌గ‌రంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు రావాల్సిందే. ఈ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కాక‌పోతే ప‌ది, ప‌దిహేను అంత‌స్తుల అపార్టుమెంట్లు క‌ట్టాల్సిన ప్రాంతంలో.. ముప్ప‌య్‌, న‌ల‌భై అంత‌స్తుల అపార్టుమెంట్లు క‌ట్ట‌డ‌మే త‌ప్ప‌ని నిపుణులు అంటున్నారు. త‌మ స్వ‌లాభం కోసం కొందరు స్థ‌ల‌య‌జ‌మానులు, మ‌రికొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు క‌లిసి.. గిరాకీ పెద్ద‌గా లేని చోట కూడా ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మిస్తుండ‌టం దారుణ‌మ‌న్నారు. దీని వ‌ల్ల వీరు తాత్కాలికంగా కొంత‌ సొమ్ము సంపాదించొచ్చు. కాక‌పోతే, ఆయా ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల గురించి ఆలోచించి ప్ర‌ణాళిక‌ల‌ను రచించాల‌ని సూచిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్‌, ప‌చ్చ‌ద‌నం వంటి అంశాల్ని బేరీజు వేసుకున్నాకే.. ఆకాశ‌హ‌ర్మ్యాల గురించి ఆలోచించాలి. అంతేత‌ప్ప‌, స్థ‌లం దొరికింది క‌దా అని.. అధిక బిల్ట‌ప్ ఏరియా కోసం.. ముప్ప‌య్‌, న‌ల‌భై అంత‌స్తుల అపార్టుమెంట్ల‌ను ఆరంభిస్తే.. వాటిని పూర్తి చేయ‌లేక నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. పైగా అనువు కాని చోట ఎంత ఎత్తుకు వెళితే, అంత నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అమ్మకాల్లేనప్పుడు అంతంత ఎత్తులో కట్టడం తలకు మించిన భారమవుతుంది. ఆయా ప్రాజెక్టును మధ్యలో నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని కోకాపేట్, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టు, నార్సింగి, తెల్లాపూర్‌, కొల్లూరు వంటి ప్రాంతాల్లో ఔట‌ర్ రింగ్ రోడ్డు వెళుతోంది. దాని ప‌క్క‌నే స‌ర్వీసు రోడ్డూ ఉంది. ఇక్క‌డ చేరువ‌లో ఉన్న ఐటీ, ఆర్థిక సంస్థ‌ల‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ ప్రాంతాల్లో ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మించొచ్చు. ఆయా ప్రాంతాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కోకాపేట్ వంటి ప్రాంతాల్లో వేలం పాటల్లో స్థలాల్ని విక్రయించింది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా అనుమతుల్ని మంజూరు చేయడాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే మియాపూర్‌, బాచుప‌ల్లి, కొల్లూరు, కొంపల్లి, మేడ్చల్ వంటి నివాస ప్రాంతాల్లో.. ముప్పయ్ నుంచి యాభై అంత‌స్తుల్ని క‌ట్ట‌డ‌మేమిట‌ని ప్ర‌జ‌లూ ప్ర‌శ్నిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు, మియాపూర్ నుంచి బాచుప‌ల్లి ప్ర‌ధాన రోడ్డు మీదే ఏడేనిమిది ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తినిచ్చారు. అక్కడ ప్రస్తుతమున్న రోడ్డు వెడ‌ల్పు ఎంత‌? మెయిన్ రోడ్డు మీదున్న డ్రైనేజీ సౌక‌ర్య‌మేంటి? చిన్న వ‌ర్షం ప‌డితే చాలు, రోడ్డంతా నీళ్లు నిండిపోయి.. రోడ్డునే మూసివేయాల్సిన దుస్థితి ఇటీవల ఏర్ప‌డింది. ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తుల్ని ఎలా మంజూరు చేస్తున్నారో అమాతుల్య‌కే తెలియాలి. రాజ‌కీయ ఒత్తిళ్ల వ‌ల్ల‌ అనుమ‌తినిస్తున్నామ‌ని ఆవేద‌న వెళ్ల‌గ‌క్కే అధికారులు లేక‌పోలేరు.
ఇప్ప‌టికైనా రాజ‌కీయాల‌కు దూరంగా.. న‌గ‌రాభివృద్ధికి సంబంధించిన ప‌క్కా ప్ర‌ణాళిక‌లు జ‌ర‌గాలి. ఏయే ప్రాంతాల్లో ఆకాశ‌హ‌ర్మ్యాల‌ను మంజూరు చేస్తారో పుర‌పాల‌క శాఖ ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేయాలి. లేక‌పోతే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఆకాశ‌హ‌ర్మ్యాలు ఆరంభ‌మై.. అవి స‌కాలంలో పూర్తి కాక‌.. ఘోస్ట్ ట‌వ‌ర్లుగా అవ‌త‌రించే ప్ర‌మాదం లేక‌పోలేదు. కాబట్టి, ఇప్ప‌టికైనా పుర‌పాల‌క శాఖ ఉన్న‌తాధికారులు క‌ళ్లు తెరిచి.. వాస్త‌వాల్ని అర్థం చేసుకుని స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. బెంగళూరు తరహాలో ముందుగా మౌలిక సదుపాయాల్ని పూర్తిగా అభివృద్ధి చేసి.. ఆ తర్వాత ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

This website uses cookies.