తిరుపతి సమీపంలోని రేణిగుంటలో 5,532 చదరపు మీటర్ల స్థలాన్నీ లీజుకు ఇవ్వడానికి రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అథార్టీ (ఆర్ఎల్ డీఏ) బిడ్లు ఆహ్వానించింది. వాణిజ్యపరమైన డెవలప్ మెంట్ కోసం ఈ మేరకు బిడ్లు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని 45 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నట్టు పేర్కొంది.
7,502 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియా కలిగిన ఈ స్థలానికి రిజర్వు ధరగా రూ.6.77 కోట్లను నిర్ధారించింది. వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఇది అనువైన ప్రాంతమని ఆర్ఎల్ డీఏ వైస్ చైర్మన్ వేద్ ప్రకాశ్ దుడేజా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరా, నిజామాబాద్, చెన్నై, భోపాల్, లూధియానా, అబూ రోడ్, వారణాసి, గోరఖ్ పూర్ లలోని రైల్వే స్థలాలను లీజుకు ఇచ్చినట్టు చెప్పారు.