Categories: LATEST UPDATES

ఆ జీవో నుంచి ఏపీ వెనక్కి

  • బిల్డర్లకు ఊరట
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిందిదే

వివాదాస్పద జీవో నెం,145 నుంచి ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. 2021 డిసెంబర్లో జారీ చేసిన ఈ జీవోను తాజాగా ఉపసంహరించుకుంది. ఈ జీవో ప్రకారం ప్రైవేటు రియల్టర్లు అభివృద్ధి చేసే లేఔట్లలో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. అలా సేకరించిన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సర్కారు వినియోగిస్తుంది. తద్వారా రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది పేదలకు ఇళ్లను అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రైవేటు రియల్టర్ల ప్రాజెక్టుల్లో 5 శాతం భూమిని తీసుకుని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని మున్సిపల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఒకవేళ ఆ లేఔట్ లో భూమి ఇవ్వడం వీలుకాని పక్షంలో ఆ సైట్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో స్థలమైనా ఇవ్వవచ్చు. లేకుంటే ఆ మేరకు డబ్బులు కూడా సర్కారుకు చెల్లించే అవకాశం ఇచ్చారు. అయితే, ఈ జోవోపై ఆది నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల తమ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, అది తమకు నష్టదాయకమని పలువురు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. జీవో జారీ ఉద్దేశం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా.. రియల్ రంగం స్తబ్దుగా మారిన వైనాన్ని గుర్తించింది. దీంతో జీవో నెం.145ని వెనక్కి తీసుకుంది. ఫలితంగా ఏపీలోని బిల్డర్లకు భారీ ఊరట లభించినట్టయింది.

  • ఇదే నిబంధన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేశారు. అయితే, ఇక్కడి బిల్డర్లు ఈ నిర్ణయానికి సంబంధించిన వాస్తవిక సమస్యలను అప్పటి ప్రభుత్వానికి వివరించి ఉపశమనం పొందారు. వాస్తవానికి, అప్పట్లో కొన్ని ప్రాజెక్టుల్లో అల్పాదాయ వర్గాల కోసం ఐదు శాతం స్థలంలో ఇళ్లనూ నిర్మించారు.
  • ఈ జీవో వల్ల కలిగే నష్టాలపై ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి.. నరెడ్కో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ జీవో రాక ముందు వీఎంఆర్డీఏలో ఏడాదికి వంద లేఅవుట్లకు అనుమతులు లభించేవి. గతేడాది కేవలం 9 సంస్థలు మాత్రమే అనుమతుల్ని తీసుకున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించామని నరెడ్కో ఆంధ్రప్రదేశ్ తెలియజేసింది.

ఏపీ క్రెడాయ్ హర్షం

జీవో నెం. 145ని ఏపీ సర్కారు ఉపసంహరించుకోవడంపై ఏపీ క్రెడాయ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రభుత్వానికి కూడా ఆదాయపరంగా లబ్ధి చేకూరుతుందని క్రెడాయ్ ఏపీ చైర్మన్ ఎస్.వెంకట్రామయ్య, అధ్యక్షుడు బి.రాజా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎస్ సీ బోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా ఎదురయ్యే సమస్యలను సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు వివరించామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ జీవోను వెనక్కి తీసుకున్నందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

This website uses cookies.