Categories: LATEST UPDATES

పీఈ పెట్టుబడుల్లో క్షీణత

  • 20 శాతం తగ్గిన పెట్టుబడులు

దేశంలోని రియల్టీ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల జోరు తగ్గింది. 2023 తొలి ఆరునెలల్లో పీఈ పెట్టుబడులు 20 శాతం మేర తగ్గి 2.58 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. ఆఫీస్, వేర్ హౌసింగ్, రెసిడెన్షియల్ విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈ పెట్టుబడులు వచ్చినట్టు వివరించింది. 2022 తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇన్వెస్టర్లు పెట్టుబడి వ్యూహాలు మార్చినట్టు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో ఈ ఏడాది ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరించడంతో ఈ క్షీణత కనిపించినట్టు వెల్లడించింది. అయితే, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఇది పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తమ్మీద ఈ ఏడాది రియల్ రంగంలో పీఈ పెట్టుబడులు5.3 శాతం వార్షిక వృద్ధితో 5.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది. కాగా, ఇప్పటివరకు వచ్చిన మొత్తం పీఈ పెట్టుబడుల్లో 68 శాతం వాటాతో ఆఫీస్ రంగం మొదటి స్థానంలో ఉందని తెలిపింది. తర్వాత 21 శాతంతో వేర్ హౌసింగ్, 11 శాతం వాటాతో రెసిడెన్షియల్ విభాగాలు ఉన్నట్టు వెల్లడించింది.

నగరాలవారీగా చూస్తే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ముంబై అత్యధికంగా 1242 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందగా.. తర్వాత ఢిల్లీ 835 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టింది. బెంగళూరుకు 347 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో సింగపూర్ నుంచి అత్యధికంగా 61 శాతం రాగా, ఇండియా నుంచి కేవలం 5 శాతమే వచ్చాయి. అలాగే కెనడా నుంచి 10 శాతం, హాంకాంగ్, అమెరికాల నుంచి 8 శాతం చొప్పున పెట్టుబడులు వచ్చాయి. రంగాలవారీగా చూస్తే ఆఫీస్ రంగానికి 1751 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గతేడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. వేర్ హౌస్ విభాగంలో మాత్రం 55 శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది తొలి అర్ధభాగంలో 1222 మిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 555 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. రెసిడెన్షియల్ విభాగంలోనూ తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 277 మిలియన్ డాలర్లు రాగా, గతేడాది తొలి ఆరునెలల్లో ఇది 314 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే 12 శాతం తగ్గింది.

This website uses cookies.