poulomi avante poulomi avante

ట‌చ్ చేస్తారా.. న‌న్ను?

సర్కారుకు డ్రీమ్ వ్యాలీ సంతోష్‌ రెడ్డి సవాల్‌..? 

* డైవర్షన్‌ ప్లాన్‌లో డాలర్‌ హిల్స్‌
* ఇప్పటికే111 జీవో ప్రాంతాల్లో అక్ర‌మ విల్లాలు
* నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు పూర్తి
* సంతోష్‌ రెడ్డిపై ఎందుకింత ప్రేమ
* అత‌న్ని కాంగ్రెస్‌లో కాపాడుతున్న‌దెవ‌రు?

డ్రీమ్ వ్యాలీ కంచర్ల సంతోష్‌ రెడ్డి.. ఇప్పుడు రియల్‌ రంగంలో ఒక్కసారిగా చర్చకెక్కిన పేరు. మొన్నటిదాకా ఆయ‌న‌కు బీఆర్‌ఎస్‌లో పార్టీ నుంచి ఫుల్‌ సపోర్ట్ ఉండేది. అప్పటి మంత్రి కేటీఆర్‌ దగ్గరి మనిషి. అందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏకంగా 111 జీవో పరిధిలో డ్రీమ్ వ్యాలీ రిసార్టు క‌ట్టినా.. ఒక్కోటి 20 కోట్ల విలువ గ‌ల ఇమాజిన్ విల్లాల్ని నిర్మించినా.. అత‌న్ని ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేదు. అందులో ఓ మంత్రికి ఒకటి.. ఐఏఎస్‌ అధికారికి ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చారనే ప్రచారం కూడా సాగింది. ఈ నిర్మాణాలు మధ్యలో ఉండగానే ప్రభుత్వం మారింది. దీంతో ఒక‌ట్రెండు నెల‌లు నిర్మాణాల్ని ఆపేశారు. ఆత‌ర్వాత య‌ధావిధిగా త‌న ప్లాన్ వ‌ర్కౌట్ చేసుకున్నాడు. కాంగ్రెస్‌ సర్కారుకు దగ్గరయ్యాడు.

రియల్టర్‌ కంచ‌ర్ల‌ సంతోష్‌ రెడ్డి గతంలో ప్రభుత్వాన్ని, ప్లాట్ల కొనుగోలుదారులను మోసం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పుప్పాలగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా సంతోష్‌రెడ్డి చేసిన మోసాలు బయటికొచ్చాయి. నార్సింగి మండలంలోని పుప్పాలగూడ పరిధిలో సర్వే నెంబర్‌ 104/1, 106, 113లో సంతోష్ రెడ్డి మరియు అతని సహచరులకు మొత్తం 60 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ 1998లో సంతోష్ రెడ్డి.. డాలర్ హిల్స్ పేరుతో 30 ఎకరాల్లో లే అవుట్ వేశాడు. అనుమతి కొంతమేరకే తీసుకున్నా.. మొత్తంగా 80 శాతం ప్లాట్లను అమ్మేశాడు. అయితే, ముందుగా అనుమతి తీసుకునేందుకు నిబంధనల ప్రకారం చూపించినా.. ఆ తర్వాత ఈ సైట్‌పై కొత్త ప్లాన్‌ వేశారు.

హెచ్‌ఎండీఏ అనుమతులు రద్దు చేసుకుంటే మరింత లాభదాయకంగా.. ఎక్కువ ధరతో వ్యవసాయ భూమిగా చూపించి అమ్ముకోవాలని సంతోష్‌ రెడ్డి టీం వ్మూహం వేసింది. అనుకున్నదే తడవుగా సైట్‌లను అభివృద్ధి చేయకపోవడం, నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులు సకాలంలో చేయకపోవడం ద్వారా సంతోష్ రెడ్డి టీం ఈ లేఅవుట్ అనుమతిని రద్దు చేయడానికి కుట్ర చేసింది. ఎట్టకేలకు సక్సెస్‌ అయి.. 2005లో హెచ్‌ఎండీఏ అనుమతిని రద్దు చేసింది. సంతోష్‌ రెడ్డి బృందం కొత్త ప్లాన్‌తో రంగంలోకి దిగింది.

ముందుగా అనుమతులు తీసుకుని విక్రయించిన ప్లాట్లను కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులకు తెలియకుండానే ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చాడు. కొన్ని ప్లాట్లు, రోడ్లు, పార్కులను డాలర్ హిల్స్ పక్కన ఉన్న 30 ఎకరాల భూమితో విలీనం చేసి, మొత్తం భూమిని వ్యవసాయ భూమిగా చూపించి, దానిని ఎన్‌సీసీ అనే నిర్మాణ సంస్థ‌కు విక్రయించాడు. ఇదే సమయంలో డాలర్ హిల్స్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొంతమంది ప్లాట్ యజమానులు లే అవుట్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. అదంతా వ్యవసాయ భూమి కింద డైవర్షన్‌ అయిందని తేలిపోయింది. అప్పటి నుంచి అంటే.. 2016 నుంచి ఆ  వివాదం కోర్టులో ఉంది. అయితే, కేసు కోర్టులో ఉన్నప్పుడు, రియల్టర్ ఆ భూమిలో ఏమీ నిర్మించకూడదు. కానీ, డాలర్ హిల్స్ నివాసితులు అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, భూమిని పేల్చడానికి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది.

మే 14న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, ఇతర అధికారులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించి, ఇరుపక్షాలను హైడ్రా కార్యాలయానికి పిలిపించి, కోర్టులో సమర్పించిన రికార్డులు, పత్రాలను ధృవీకరించారు. గతంలో సంతోష్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును కూడా పరిగణలోకి తీసుకున్నారు. తాజాగా హైడ్రా బుల్డోజర్లు.. ఎన్‌సీసీ రియల్టర్లు వివాదంలో ఉన్న భూమిలోని  నిర్మాణాలను కూల్చివేసింది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయరాదని బోర్డు పెట్టింది.

111 జీవోలో అక్రమంగా విల్లాలు
అంతేకాకుండా 111 జీవో పరిధిలో అక్రమంగా విల్లాలు నిర్మించినట్లుగా గతంలోనే అధికారుల బృందం తేల్చింది. 111 ఈవో ప్రాంతంలోని బకారంలో డ్రీమ్ వ్యాలీ అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ శాఖ నిర్ధారించినప్పటికీ, హెచ్‌ఎండీఏ పెద్దగా పట్టించుకోలేదు. విల్లాలను కూల్చివేసేందుకు తమ వద్ద సిబ్బంది లేరని, యంత్రాలు కూడా లేవని కుంటి సాకులు చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే.. డ్రీమ్ వ్యాలీ యజమాని కంచర్ల సంతోష్ రెడ్డి ఓ కాంగ్రెస్‌ మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని.. తమ విల్లాలకు అడ్డు రాకుంటే పెద్ద గిఫ్ట్ ఇస్తామని, ఇమాజిన్ విల్లాలపై చర్య తీసుకోకపోతే ఉచితంగా విల్లాలు ఇస్తామని చెప్పినట్లు గతంలో ప్రచారం జరిగింది. అందుకే ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికారులెవ్వరూ  ఇమాజిన్‌ విల్లాలపై ఎలాంటి చర్యల్ని  తీసుకోలేదు. ఓ వైపు 111 జీవోలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని తొలిగించాలని పీసీసీ చీఫ్‌గా డిమాండ్‌ చేసిన రేవంత్‌ రెడ్డి.. సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్నే మరిచిపోయారు. మొత్తంగా అప్పుడు బీఆర్‌ఎస్‌ను.. ఇప్పుడు కాంగ్రెస్‌ను మెనేజ్‌ చేసిన సంతోష్‌ రెడ్డి.. తాజాగా ఇదే 111 జీవో పరిధిలో మ‌రో కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడ‌ని తెలిసింది.

పంచాయతీ పేపర్లు
భూ వ్యవహారాల్లో సంతోష్‌ రెడ్డి చేస్తున్న మోసాలు భారీగానే ఉంటున్నాయని అధికారులే చెబుతున్నారు. ఈ 111 జీవో పరిధిలో గతంలోనే.. అంటే శివారు ప్రాంతాలన్నీ గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నట్లు కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పాత‌, కొత్త స‌ర్పంచిల‌కు డ‌బ్బులు ఎర‌వేసి.. పంచాయ‌తీ అనుమ‌తి తీసుకుని క‌డుతున్న‌ట్లు నాట‌కాలేస్తున్నారు. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలో పంచాయ‌తీ అనుమ‌తి ఎలా ఇచ్చారు.. ఎప్పుడు ఇచ్చారనేది ఇప్పటికీ తెలియకపోవడం విచిత్రమే మరి.

సంతోష్‌ రెడ్డి వ్యాపారం.. నిషేధిత ప్రాంతాల్లోనే..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 111 జీవోను ఎత్తి వేస్తామని కేసీఆర్‌ ఎన్నికలలో హామీ ఇచ్చినప్పటి నుంచి కొంతమంది రియల్టర్లకు భారీగా లబ్ధి జరిగింది. ఇందులో ప్రధానంగా కంచర్ల సంతోష్‌ రెడ్డి వంటి రియల్టర్లు భారీ ప్లాన్లతో ప్రాజెక్టులు చేపట్టారు. శాశ్వత నిర్మాణాలు నిషేధించబడిన ఈ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించి విల్లాలు మొదలెట్టారు. అటు అప్పటి మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడుగా మారిన సంతోష్‌ రెడ్డి.. 111 జీవో ప్రాంతంలో ఏం చేసినా అడ్డుకునేవారు కరువయ్యారు.

అంతేకాదు.. 111 జీవో పరిధిలోని బాకారంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌ను నిర్వహిస్తున్న సంతోష్‌రెడ్డి.. ఈ రిసార్ట్‌లో 90 గదుల నుండి నెలకు రూ. 2.16 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నాడు. అయితే, 111 జీవో పరిధిలో ఇవన్నీఉన్నా.. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకున్నా ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత ఇదే పరిధిలో ఇమాజిన్‌ విల్లాలను నిర్మించాడు. ఇప్పుడు మరిన్నిన కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాడు. ఆనాడు 111 జీవో భూములను కాపాడుతామని, హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ పరివాహకాన్ని కాపాడుతామంటూ చెప్పిన ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు మాత్రం సంతోష్‌ రెడ్డికి బంధువులుగా మారి కాపాడుతుండ‌టం కొస‌మెరుపు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles