- త్వరలో అందుబాటులోకి రానున్న ఖమ్మం-దేవరపల్లి హైవే
- పచ్చని పంట పొలాల మధ్య నిర్మాణం
- విజయవాడ టచ్ చేయకుండానే విశాఖకు వెళ్లే రోడ్డు
- 125 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం
తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలు హైదరాబాద్, విశాఖపట్నం మధ్య దూరం దగ్గర కానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా రెండు నగరాల మధ్య దూరం, ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇందుకు దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ టచ్ చేయకుండానే వైజాగ్ వెళ్లొచ్చు.
ఈ రహదారితో 125 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా దాదాపు 4 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. పచ్చని పంట పొలాల మధ్య ఈ హైవే (365-బీజీ)ను నిర్మిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం చేరుకోగానే ఈ రహదారి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మొదలైన ఈ రోడ్డు.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ముగుస్తుంది.
ఈ రోడ్డు నిర్మాణం కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్రం సేకరించింది. రూ.4,609 కోట్ల వ్యయంతో 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ నాలుగు లేన్ల రహదారిలో 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లిలో ఎంట్రీ పాయింట్లు ఉండగా.. ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి.
ఏపీలో 4 చోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రహదారిలో 117 అండర్ పాస్ లు, 33 కల్వర్టులు, 9 భారీ వంతెలను ఉన్నాయి. ఈ రహదారి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దీనిని ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు.