Categories: Celebrity Homes

రూ.48 కోట్లతో ఫ్లాట్ కొన్న మాధురీ దీక్షిత్

బాలీవుడ్ నటి మాధురీ దక్షిత్ సీ వ్యూ లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ముంబై వర్లీ లోని డాక్టర్ ఈ మోసెస్ రోడ్డులోని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఇండియాబుల్స్ బ్లూ లో రూ.48 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్ సొంతం చేసుకున్నారు. ఈ అపార్ట్ మెంట్ లోని టవర్ సీలో 53వ అంతస్తులో 5,384 చదరపు అడుగుల ఫ్లాట్ ను ఆమె కొనుగోలు చేశారు. ఆ ఫ్లాట్ నుంచి అరేబియా సముద్రంతోపాటు మహాలక్ష్మి రేస్ కోర్సు అద్భుతంగా కనిపిస్తాయి. చదరపు అడుగుకు రూ. 90వేలు ధర పడినట్టయింది. రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లో ఈ ఏడాది దేశంలో పలికిన అత్యంత ఎక్కువ ధర ఇదే కావడం విశేషం.

ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ కింద మాధురీ దీక్షిత్ రూ.2.4 కోట్లు చెల్లించారు. గతనెల 28న ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. వాస్తవానికి 5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉండగా.. మహిళా కోటా కింద ఒక శాతం రిబేటు లభించింది. కొనుగోలు ఒప్పందంలో భాగంగా మాధురికి ఏడు పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. కాగా, గతేడాది ఇదే అపార్ట్ మెంట్ లోని 29వ అంతస్తులో 5,500 చదరపు అడుగుల సీ వ్యూ ఫ్లాట్ ను మూడేళ్ల కాలానికి మాధురి లీజుకు తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఫ్లాట్ కొనుగోలు చేసినందున లీజు కొనసాగిస్తారా లేక రద్దు చేసుకుంటారా అనేది తెలియలేదు.

This website uses cookies.