Categories: LEGAL

రేడియస్ గ్రూప్ ఎండీ ఛబ్రియాకు బెయిల్ నిరాకరణ

యస్ బ్యాంకు-డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకు రుణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో రేడియస్ గ్రూప్ ఎండీ సంజయ్ ఛబ్రియా బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు తిరస్కరించింది. మనీల్యాండరింగ్ లో తన ప్రమేయం లేదని నిరూపించడంలో ఆయన విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. బెయిల్ పై విడుదలైన తర్వాత అతను నేరం చేయవచ్చనే అంశం మోడస్ ఆపరేషన్లో ప్రతిబింబిస్తుందని, ఈ నేరం తీవ్రమైనది అని పేర్కొన్న న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే.. ఛబ్రియాకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

‘2018 జూన్ మొదటి వారంలో యెస్ బ్యాంకు నుంచి డీహెచ్ఎఫ్ఎల్ రూ.2700 కోట్లు రుణం తీసుకున్న తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ రేడియస్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.1100 కోట్లు, సుమర్ రేడియస్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.439 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఫ్లాగ్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రేడియస్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదే ప్రాజెక్టు కోసం వరుసగా రూ.678 కోట్లు, రూ.100 కోట్ల రుణాలు పొందిన ఛబ్రియా ద్వారా రెండింటినీ నియంత్రించారు. అలాగే ఆ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ అభివృద్ధి కోసం అని రూ.678 కోట్లు రుణం తీసుకున్నప్పటికీ, దానిని అందుకు వినియోగించలేదు. నిజానికి క్లబ్ పని ఇంకా ప్రారంభం కాలేదు. రుణంగా తీసుకున్న మొత్తాన్ని డీహెచ్ఎఫ్ఎల్ అనేక ఇతర ప్రయోజనాలకు మళ్లించి రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా మార్చింది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2022 జూన్ 7న ఛబ్రియాను అరెస్టు చేసింది. అనంతరం గతేడాది మార్చి 24న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

This website uses cookies.