Categories: LEGAL

హరిత ట్రిబ్యునల్ పై సుప్రీం అసంతృప్తి

జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలు చాలా యాంత్రికంగా, ముందే రూపొందించిన డ్రాప్ట్ లా ఉంటున్నాయని, చాలా కేసుల్లో ఇలాగే జరుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను త్వరలోనే మళ్లీ తీసుకుని సరైన ఆదేశాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టాడనే కారణంతో ఓ బిల్డర్ కు ఎన్జీటీ రూ.40 కోట్ల జరిమానా విధించింది.

దీనిపై సదరు బిల్డర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇదే తొలిసారి కాదు. యాంత్రిక, ముందే రాసి ఉంచిన ఆదేశాలు దాదాపు ప్రతిరోజూ ఎన్జీటీ నుంచి వెలువడుతున్నాయి. దీనిపై మేం చాలా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాం. ఈ నేపథ్యంలో అలాంటి ఆదేశాలను మరోసారి సమీక్షించి సరైన ఆదేశాలివ్వాలి’ అని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.

This website uses cookies.