Categories: TOP STORIES

వెల్లువలా విదేశీ పెట్టుబడులు

  • 2017-22లో మూడు రెట్లు పెరిగి
    26.6 బిలియన్ డాలర్లకు చేరిన ఇన్వెస్ట్ మెంట్స్
  • ఈ కాలంలో మొత్తం పెట్టుబడుల్లో 81 శాతం
    విదేశీ సంస్థాగత పెట్టుబడులే
  • ఆఫీస్ సెక్టార్ ది అత్యధికంగా 45 శాతం వాటా

భారతదేశ రియల్ ఎస్టేట్ లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్లలో ఏకంగా 26.6 బిలియన్ డాలర్లు విదేశీ సంస్థాగత పెట్టుబడులు ప్రవహించాయి. ఇది గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మేరకు కొలియర్స్ ‘ఇండియా-హై ఆన్ ఇన్వెస్టర్స్’ ఎజెండా నివేదిక వెల్లడించింది.

పారదర్శకతతోపాటు వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం, నిర్మాణాత్మక, విధాన సంస్కరణలతో రియల్ పరిశ్రమ సమగ్ర మార్పులతో ముందుకెళ్తున్న నేపథ్యంలో దేశంలోకి గత కొన్నేళ్లుగా విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దేశంలోని జనాభా, లోతైన డిజిటల్ టాలెంట్ పూల్, అభివృద్ధి ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలు భారత్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ కు దోహదం చేస్తూ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ కు మన దేశం అగ్ర ఎంపికలలో ఒకటిగా నిలిచేలా చేశాయి. బలమైన ఆర్థిక, వ్యాపార, ప్రాథమిక అంశాలు సంస్థాగత పెట్టుబడిదారుల నమ్మకాన్ని మెరుగుపరుస్తున్నాయి. దీంతో తమ పోర్ట్ ఫోలియోలను విస్తరించుకోవడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి మన దేశాన్ని వేదికగా చేసుకుంటున్నారు.

2017-22 కాలంలో ఆఫీస్ సెక్టార్ అత్యధిక పెట్టుబడులు చూసింది. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 45 శాతం వాటా కార్యాలయ రంగానిదే. పెట్టుబడిదారులు ఆఫీస్ ప్రాపర్టీలపై ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఆస్తులపైనా ఆసక్తి కనబరుస్తున్నారని కొలియర్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంకీ ప్రసాద్ వెల్లడించారు. కొలియర్స్ నివేదిక ప్రకారం చూస్తే.. 2017-22లో రియల్ ఎస్టేట్ లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 81 శాతం విదేశీ పెట్టుబడులేనని తెలుస్తుంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎఫ్ డీఐ విధానాలు, ఒప్పందాల్లో పెరిగిన పారదర్శకత, ప్రత్యక్ష మార్గం ద్వారా అధిక పెట్టుబడి పరిమితులు మనదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ పెట్టుబడిదారులను ప్రోత్సహించాయి. 2023 క్యూ-1లో కూడా సంస్థాగత పెట్టుబడులు కొనసాగాయి. వార్షికంగా 37 శాతం వృద్ధితో 1.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక్కడ కూడా ఆఫీస్ సెక్టార్ దే అత్యధిక వాటా.

నిర్మాణాత్మాక పురోగ‌తి

మనదేశం రాబోయే కొన్నేళ్లలో నిర్మాణాత్మకంగా పురోగమిస్తుంది. రియల్ ఎస్టేట్ లో స్పెక్ట్రమ్, అసెట్ కాస్ లలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గ్లోబల్, ఏపీఏసీ పెట్టుబడిదారుల దృష్టిలో భారత రియల్ రంగం ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలు, మెరుగైన విలువలతోపాటు అధిక ఆదాయాన్ని ఇస్తుందనే భావన ఉంది. ఏపీఏసీ ప్రాంతంలోని ఇతర నగరాలతో పోలిస్తే భారతీయ నగరాలు తక్కువ ధరల వద్దే అధిక ఆదాయాన్ని ఇస్తుండటంతో భారతదేశం ఓ ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మారింది. ఆఫీస్ ఆదాయంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. పారిశ్రామిక ప్రాపర్టీల విషయంలో ముంబై టాప్ లో ఉంది. – పీయూష్ గుప్తా, ఎండీ, కొలియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ సర్వీసెస్

This website uses cookies.