Categories: CONSTRUCTION

అందుబాటు గృహాల్లో ఆధునిక ప‌రిజ్ఞానం

ప‌ద‌మూడు అంత‌స్తుల ఎత్తులో అందుబాటు గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగుల సాయంతో ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజ‌న కింద క‌ట్టే నిర్మాణాల్ని కనీసం ఏడాదిలోపే పూర్తి చేయ‌వ‌చ్చ‌ని ప్రధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ తెలిపారు. దేశంలోని 6,368 అందుబాటు గృహాల్లో 66 శాతం నిర్మాణాలు స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞ‌నం సాయంతో నిర్మాణం అయ్యాయ‌ని వెల్ల‌డించారు. ఇవ‌న్నీ కూడా ఫ్యాక్ట‌రీలోనే త‌యార‌య్యాయ‌ని.. వాటిని సైటు వ‌ద్ద‌కు వ‌చ్చి బిగించార‌ని తెలిపారు.

* ఆగ‌ర్తాల‌, ల‌క్నో, రాజ్‌కోట్ వంటి ప్రాంతాల్లో నిర్మించిన బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల‌కు సంబంధించిన నిర్మాణాలు ఇండోర్‌, భోపాల్‌, బిలాయ్‌, పుణే వంటి నగ‌రాల్లోని ఫ్యాక్ట‌రీలో తయార‌య్యాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమిటంటే, హైద‌రాబాద్లోనూ ఈ త‌ర‌హా క‌ట్ట‌డాలు ఫ్యాక్టరీలో త‌యారౌతున్నాయ‌ట‌. దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా ఆధునిక ప‌రిజ్ఞానంతో బ‌హుళ అంత‌స్తుల్ని ఏడాదిలోపు పూర్తి చేస్తున్నారు. ఈ సంస్థ‌లు నిర్ణీత గ‌డువులోపే పూర్తి చేస్తామ‌ని ప్ర‌ధానికి హామీ ఇచ్చాయ‌ని తెలిసింది. ఫ్రాన్స్ నుంచి మోనోలిథిక్ కాంక్రీటు క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ప‌రిజ్ఞానం దిగుమ‌తి చేసుకుని రాజ్‌కోట్‌లో నిర్మాణాల్ని చేప‌డుతున్నారు. కెన‌డా ప‌రిజ్ఞానం సాయంతో ల‌క్నోలో.. అమెరికా, ఫిన్‌లాండ్ ప‌రిజ్ఞానంతో చెన్నై.. జ‌ర్మ‌నీ త్రీ డీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సిస్ట‌మ్ సాయంతో రాంచీలో క‌డుతున్నారు. మొత్తం నిర్మాణాన్ని క‌ట్ట‌డం కంటే ముందు ప్ర‌తి రూముని విడివిడిగా క‌డ‌తారు. న్యూజిలాండ్ స్టీలు ఫ్రేముల సాయంతో అగ‌ర్తాల‌లో భూకంపాన్ని త‌ట్టుకునేలా అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తున్నారు. మొత్తానికి, విదేశీ ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని మ‌న‌దేశంలో నిర్మాణాల్ని చేప‌ట్ట‌డం స్వాగతించాలి.

This website uses cookies.