- హైదరాబాద్ లో 24 శాతం వృద్ధి
- అత్యధికంగా ముంబైలో అత్యధికంగా పెరుగుదల
దేశంలో ఆఫీస్ మార్కెట్లో అద్దెలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ లో కార్యాలయ అద్దెలు గత మూడేళ్లలో 24 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ అద్దె ధర 2022లో రూ.58గా ఉంటే.. అది 2025 నాటికి రూ.72కు పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో (ఎంఎంఆర్) చదరపు అడుగుకు అద్దె రూ.131 నుంచి రూ.168కి చేరింది. 2022 నుంచి 2025 మధ్య కాలంలో (కరోనా అనంతరం) ప్రీమియం ఆఫీసు వసతులకు డిమాండ్ స్థిరంగా వృద్ధి చెందినట్టు.. ముఖ్యంగా ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్ కీలక కేంద్రాలుగా ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. అన్ని మెట్రోల్లోనూ అద్దె ధరల్లో మంచి వృద్ది నమోదైనట్టు పేర్కొంది.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఆఫీస్ వసతుల అద్దె 20 శాతం మేర పెరిగి చదరపు అడుగుకు రూ.92 నుంచి రూ.110కి చేరింది. బెంగళూరులో నెలవారీ అద్దె చదరపు అడుగునకు రూ.16 శాతం వృద్ధి చెంది రూ.82 నుంచి రూ.95కి పెరిగింది. పుణెలో 11 శాతం పెరుగుదలతో రూ.80కి, చెన్నైలో 9.1 శాతం పెరిగి రూ.72కు చేరుకుంది.
ALSO READ: ఎన్నారైలు ఇండియాలో ఇల్లు కొనే ముందు ఏం చూడాలంటే?
గ్రేడ్ ఏ ఆఫీస్ లీజింగ్లో 45 శాతం యూఎస్ కంపెనీల నుంచే ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. ముంబైలో బీఎఫ్ఎస్ఐ ఆఫీస్ లీజింగ్లో 48 శాతం యూఎస్కు చెందిన బ్యాంక్లు లీజింగ్కు తీసుకున్నట్టు చెప్పారు. భారత్లో గ్రేడ్ ఏ ఆఫీస్ వసతులకు అమెరికన్ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపారు.