- ఆన్లైన్ అమ్మకాల మహత్యం ఇదీ..
రియల్ ఎస్టేట్ రంగంలో ఏం కొనాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే. ఇల్లు, స్థలం.. ఏది కొన్నా దాని విలువను బట్టి కమీషన్ చెల్లించాల్సిందే. అయితే ఆధునిక కాలం తెచ్చిన మార్పుతో స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల స్థానంలో టెక్నాలజీ వచ్చేసింది. అవును ఇప్పుడు రియల్ రంగంలో ఇంటి కొనుగోళ్లన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇలా ఆన్ లైన్ ద్వారా స్థిరాస్తి లావాదేవీల వల్ల భారత్ లో ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల కోట్ల రూపాయల వరకు బ్రోకరేజ్ ఆదా అవుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమీషన్ సర్వసాధారణం. మనం ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మద్యవర్తికి కమీషన్ చెల్లించాల్సిందే. అది వ్యక్తి అయినా, సంస్థ అయినా బ్రోకరేజ్ ఇవ్వాలి. ప్రాపర్టీ విలువను బట్టి బ్రోకరేజీ అమౌంట్ ఉంటుంది. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌజ్ వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మద్య వర్తులుగా వ్యవహరిస్తుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ అంశంలో చాలా మార్పు తీసుకువచ్చిది. అందుకు తోడు టెక్నాలజీ సైతం రియల్ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు చాలా వరకు మధ్యవర్తులు లేకుండానే స్థిరాస్థి లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి కొనుగోళ్లకు సంబందించి చాలా వరకు ఆన్ లైన్ లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా ప్రాపర్టీ డెవలపర్ లేదా బిల్డర్ ను ఆన్ లైన్ లో కాంటాక్ట్ చేస్తున్నారు.
ఇంటి ధర, అడ్వాన్స్ చెల్లింపులు, ఇంటి నిర్మాణానికి సంబందించిన అగ్రిమెంట్స్ వంటి వివరాలన్నీ ఆన్ లైన్ లోనే తెలుసుకుంటున్నారు. అంతే కాదు బీజీ లైఫ్ కు తోడు, టెక్నాలజీ తెచ్చిన మార్పు వల్ల సైట్ ను సైతం వీడియో వాక్ త్రూ ద్వార ఇంటి నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నారు. దీంతో ఇళ్ల కొనుగోళ్లకు సంబందించి మధ్యవర్థుల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. స్థిరాస్తి కొనుగోళ్లలో ఆన్ లైన్ లావాదేవీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ రియల్ రంగ మార్కెటింగ్ సంస్థల లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానమైన మెట్రో నగరాల్లో 30 నుంచి 40 శాతం మంది ఇంటి కొనుగోలుదారులు ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారట. వీళ్లంతా వీడియో వాక్త్రూ ప్రాపర్టీలను వీక్షించి, ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, ముంబై, పూనేలు వంటి నగరాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఆన్ లైన్ పై ఆధారపడుతుండగా ఢిల్లీ, హైదరాబాదీలు ఇంకా బ్రోకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఐటీ తదితర సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే వారు బిజీ లైఫ్ వల్ల పలు మార్లు నేరుగా కొనుగోలు చేస్తున్న ఇంటికి సంబంధించిన ప్రాజెక్టును విజిట్ చేయలేకపోవచ్చు. అలాంటి వారికి ఆన్ లైన్ ద్వార టెక్నాలజీని ఉపయోగించి అన్నింటిని వీడియో వాక్ త్రూ ద్వార వీక్షించి, చెల్లింపులు సైతం ఆన్ లైన్ ద్వార చేసేయొచ్చు. ఐతే ఆన్ లైన్ ద్వార స్థిరాస్తుల కొనుగోళ్లు చేయడం ద్వార బ్రోకరేజ్ ఆదా అవుతుందని కానీ కొన్ని లోటుపాట్లు ఉంటాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యవర్తి ద్వారా ఇళ్లు లేదా ఇంటి స్థలం కొంటే ఆ తరువాత బిల్డరు, లేదంటే అమ్మకందారుతో ఏమైనా సమస్య వస్తే మీడియేటర్ బాధ్యత వహిస్తాడు. కానీ ఆన్ లైన్ లో ఇళ్లు కొంటే మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తుతే కొనుగోలుదారులు, నిర్మాణదారులు మాత్రమే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.