Categories: TOP STORIES

తెల్లాపూర్ పాయే.. కొల్లూరు వచ్చే?

    • కొల్లూరు ఐటీ హబ్.. 640 ఎకరాల గుర్తింపు..
    • పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు..

కొల్లూరు ( Kollur ) లో ఐటీ హబ్ వస్తుందని.. ఇక్కడేదో రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇలాంటి వార్తలు కేవలం అక్కడి భూముల ధరల్ని కృత్రిమంగా పెంచుకోవడానికి పనికొస్తుందని గుర్తుంచుకోండి. బుద్వేల్లో ఐటీ పార్కు అన్నారు.. తర్వాత ఏమైంది? ఐటీ అయితే రాలేదు కానీ.. భూముల ధరలు మాత్రం పెరిగిపోయాయి. అప్పటివరకూ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. మధ్యతరగతి ప్రజానీకానికి రూ.40 నుంచి 50 లక్షల్లో ఫ్లాట్ లభించేది. కానీ, ఒక్కసారిగా రేట్లు పెరగడంతో అక్కడా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కొనలేని దుస్థితి నెలకొంది. కొల్లూరులో ఇదే ప‌రిస్థితి ఏర్ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. తెల్లాపూర్లో టిష్మన్ స్పయర్స్ కు 400 ఎక‌రాల భూమిని కేటాయించారు. అందుకు సంబంధించిన సొమ్ము ఆయా సంస్థ అప్ప‌టి హుడాకు చెల్లించింది. ఆత‌ర్వాత ఆర్థిక మాంద్యం ఏర్ప‌డంతో ఆ ప్రాజెక్టు వెన‌క్కి పోయింది. ద‌శాబ్దం దాటినా ఆ 400 ఎక‌రాల సంగ‌తి ఇంకా తేల‌లేదు. 400 ఎకరాలకు బదులు ఆయా సంస్థ కట్టిన మొత్తానికి గాను వంద ఎకరాల్ని కేటాయించే ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందో తెలియదు. పైగా, అప్పట్లో టిష్మన్ స్పయర్స్ కు భూమిని కేటాయింపు ప్రక్రియ.. అప్పటి హుడా వైస్ ఛైర్మన్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ కార్యదర్శిగా విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ శాఖ మంత్రి కేటీఆర్ వద్ద ఉంది. మరి, ఈ తెల్లాపూర్ భూమి సంగతిని పరిష్కరించడం ప్ర‌భుత్వానికి స‌మ‌స్య కాదు. దీంతో గత దశాబ్దానికి పైగా పెండింగులో ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది.

 

రేటు పెంచుతారు.. జాగ్రత్త!

కొల్లూరు ప్రాంతం రానున్న రోజుల్లో డెవలప్ అవుతుందనే విషయంలో సందేహం లేదు. కాకపోతే, ఇప్పటికిప్పుడే అక్కడా నివాసయోగ్యమైన పరిస్థితుల్లేవు. రహదారులు, మురుగునీటి సౌకర్యం, ఆస్పత్రులు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, రెస్టారెంట్లు వంటివి పెద్దగా డెవలప్ కాలేదు. అందుకే, ధర కొంత అందుబాటులో ఉంది. ఇక ఐటీ హ‌బ్ వ‌స్తుంద‌నే వార్త‌.. అక్క‌డి యూడీఎస్ కంపెనీల‌కు.. రియాల్టీ ఏజెంట్ల‌కు పెద్ద పండగే అని చెప్పొచ్చు. ఈ దెబ్బ‌తో అమ్మ‌కాల్ని పెంచుకుంటారు. వీలైతే రేటు పెంచే ప్ర‌య‌త్నం చేస్తారు. ఓ ప‌దేళ్ల త‌ర్వాత పెర‌గాల్సిన రేటును ఇప్పుడే పెంచేసి.. మార్కెట్‌ను త్రిశంకు స్వర్గంలో నెట్టేస్తారు. మ‌హేశ్వ‌రం, పోచారం, బుద్వేల్‌, కొంప‌ల్లి, సుల్తాన్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఇలాగే రేట్లు పెంచేసి.. రియ‌ల్ సంస్థ‌లు, ఏజెంట్లు క‌లిపి మార్కెట్ ను స‌ర్వ‌నాశ‌నం చేశారు. కాబట్టి, రేటు విష‌యంలో ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాకే కొనాలా? వద్దా? అనే అంశంలో తుది నిర్ణ‌యం తీసుకోండి.

This website uses cookies.