- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- నోవాటెల్లో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్
- రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం
- బిల్డర్స్ కు స్వర్గధామం హైదరాబాద్
- హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మారుస్తాం
బిల్డర్లు, డెవలపర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని.. వీరు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం నోవాటెలో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బిల్డర్లకు ఎలాంటి ఇబ్బందుల్లేని కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి బిల్డర్లు, డెవలపర్లను ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులుగా బిల్డర్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని.. బిల్డర్లకు హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం, ప్రపంచ పటంలో రైజింగ్ గా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని ముందుకెళుతుందని తెలిపారు.
నెట్ జీరో సిటీ ఒప్పందం చేసుకొని హైదరాబాద్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.
గ్రీన్ సిటీగా..
హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీ ప్రజలు స్థానికంగా ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారని.. ఒక సీజన్లో అక్కడి నుంచి పౌరులు వలస వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఆ దుస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో డీజిల్ వాహనాలను దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయి.. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించేందుకు కూడా వెనుకాడమని తెలిపారు. కాలుష్యరహిత నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆదాయం కంటే హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానం అన్నారు.
నెట్ జీరో సిటీ..
ప్రపంచ కేంద్రంగా ఫోర్త్ సిటీని తీర్చిదిద్దుతామని అన్నారు. నెట్ జీరో సిటీ నిర్మాణంలో భాగంగా.. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. మూసి పునర్జీవనం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి అని.. దశాబ్ద కాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నదిలో పరిశుభ్రమైన నీరు పారించి.. మూసీ హైదరాబాద్కు ఒక వరంలా మారుస్తామని అన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఖర్చు అయినా ముందుకు వెళతామని తెలిపారు. 2029-30 కి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్ పాలసీలో స్పష్టం చేశామని, 35 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ సి.శేఖర్రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్రెడ్డి, టీబీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.